నర్సీపట్నం: గోతులు పూడ్చారు..పట్టుమని ఏడాదిన్నర తిరగకుండానే పూడ్చిన గుంతలు యథావిధంగా దర్శనమిస్తున్నాయి. చిన్న గొయ్యి కూడా ఉండడానికి వీల్లేదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ప్యాచ్ వర్కులు చేయించారు. జిల్లాలో పరిశీలిస్తే చేసిన పనులే చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. గుంతలను మట్టితో కప్పేస్తున్నారు. పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో ఫలితంగా ఎక్కడ చూసినా గుంతలే కనపడుతున్నాయి. జనం ప్రమాదాల బారిన పడుతున్నారు.
రూ.కోట్లు ఖర్చు..ఫలితమిస్తే ఒట్టు
జిల్లాలో రోడ్లు భవనాల శాఖ అధికారులు 14 సెక్షన్ల్లో గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. నర్సీపట్నం, పాయకరావుపేట, కె.కోటపాడు, కె.డి.పేట, సబ్బవరం, పెదబొడ్డేపల్లి, పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లి, వి.మాడుగుల, దార్లపూడి, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి సెక్షన్ల్లో రూ.8.80 కోట్లతో 119 వర్కులకుగాను 521.32 కిలోమీటర్లు పొడవునా గుంతలు పూడ్చారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో గుంతలను పూడ్చేందుకు రూ.2 కోట్లు వెచ్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అవే గుంతలు దర్శనమిస్తున్నాయి.
మట్టితో నింపేసి...ౖపైపెన తారు పూసి...
నిబంధనల ప్రకారం గుంతల్లో మట్టి తొలగించి చుట్టూ కొంతభాగం తీసి నాణ్యమైన కంకర వేసి తారు వేసి రోలింగ్ చేయాల్సి ఉంది. కానీ మట్టితో నింపేసి ౖపైపెన తారు పూసి మమ అనిపించేస్తున్నారన్న విమర్శఽలున్నాయి. ఫైర్స్టేషన్ సమీపంలో నర్సీపట్నం నుంచి తుని వెళ్లే రహదారిపై గుంతలు ఏర్పడి కంకర తేలడంతో తారు పనులు చేశారు. కొన్ని నెలలకే తిరిగి యథాస్థితికి చేరుకుంది. నాణ్యత లోపాలు ఎత్తిచూపింది. ఈ గుంతల్లో వారం రోజుల క్రితం మెటల్ వేసి వదిలేశారు. దీంతో వర్షాలకు మరీ అధ్వానంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బలిఘట్టం వై.జంక్షన్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతలు మరింత అధ్వానంగా మారి ప్రమాదాలను తలపిస్తున్నాయి.


