తుమ్మపాల: ఈ నెల 1, 2 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన 23వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్–2026లో అనకాపల్లి పట్టణానికి చెందిన చిన్నారులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలను కైవసం చేసుకున్నారు. పట్టణంలోని రింగ్ రోడ్డులో ఉన్న తీక్షిత షోటోకాన్ కరాటే అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని మొత్తం 13 పతకాలు సాధించి అకాడమీతో పాటు జిల్లాకు గుర్తింపు తీసుకురావడంపై కోచ్ టి.ఈశ్వరరావు, తల్లిదండ్రులు బుధవారం అభినందించారు. కె.ప్రణీత్ శ్రీనివాస్ కుమిటే విభాగంలో స్వర్ణ పతకం, ఎన్.సంతోష్, కతా, కుమిటే విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు, బి.అవినాష్ కతా విభాగంలో స్వర్ణ పతకం, కె.గీతాలక్ష్మి కతా విభాగంలో స్వర్ణం, కుమిటేలో కాంస్యం, కె.జశ్వంత్ కతా విభాగంలో స్వర్ణం, కుమిటేలో కాంస్య పతకం సాధించారు. అలాగే వి.ఏక్షిత్ కుమిటే విభాగంలో రజత పతకం గెలుచుకోగా, ఎం.ప్రణీత్, ఎస్.కార్తిక్ కుమిటే విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఎస్కే.నజీర్, కె.యశ్వంత్, బి.దివాకర్, ఆర్.లాలా, జి.హర్షిత్ హనీష్ కతా విభాగంలో కాంస్య పతకాలు సాధించి ప్రతిభ చాటారు. విద్యార్థుల విజయంపై కోచ్ ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


