కంచరపాలెం: విశాఖలో హత్యకు గురైన ఓ యువతి మృతదేహాన్ని సూట్కేసులో పెట్టి వందల కిలోమీటర్ల దూరంలోని ఒడిశా రాష్ట్రం రాయగడలో పడేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు విశాఖకు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఊర్వశి సమీపంలోని గౌరీనగర్కు చెందిన బొలిశెట్టి సురేష్ (32) పోలీస్ శాఖలో ఆప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య గర్భవతి కావడంతో ఆమెను పుట్టింటికి పంపించాడు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో పరిచయమైన సంధ్య అనే యువతితో సురేష్కు సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఈ నెల 15న సురేష్ ఇంటికి వచ్చి నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా సురేష్ ఆగ్రహంతో దాడి చేయడంతో యువతి మృతి చెందింది. అనంతరం జగదాంబ జంక్షన్ ప్రాంతంలో సూట్కేసు కొనుగోలు చేసి మృతదేహాన్ని అందులో ఉంచి జ్ఞానాపురం రైల్వే స్టేషన్ నుంచి రాయగడకు తీసుకెళ్లి చాందిలి పోలీస్స్టేషన్ పరిధిలో వదిలేసి విశాఖకు తిరిగి వచ్చాడు. అక్కడ సూట్కేసులో మృతదేహాన్ని గమనించిన ఒడిశా పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు జరిపారు. నిందితుడు సురేష్ను గుర్తించి గురువారం సాయంత్రం విశాఖకు వచ్చి అరెస్టు చేశారు.


