అల్లిపురం: క్రికెట్ బెట్టింగ్ బరిలోకి రాజకీయ పలుకుబడి ఉన్న యువనేతలు కూడా దిగుతున్నారా? రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడినంటూ ప్రచారం చేసుకుంటున్న టీడీపీ తెలుగు యువత నాయకుడు, జీవీఎంసీ 51వ వార్డు అధ్యక్షుడు పేడాడ మణికంఠ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్టు కావడం రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.
సీతన్న గార్డెన్స్ కేంద్రంగా బెట్టింగ్?
ఇండియా–ఇంగ్లాండ్ టీ20 సిరీస్ సందర్భంగా నగరంలో లక్షల్లో బెట్టింగ్ జోరందుకుందన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు మాధవధారలోని సీతన్న గార్డెన్స్ అపార్ట్మెంట్పై సంయుక్తంగా దాడి చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న మణికంఠతో పాటు ఆయన అనుచరుడు సికిలిపల్లి శాంతి స్వరూప్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు పత్రాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
లోకేష్ సాన్నిహిత్యమే పెట్టుబడిగా..
మణికంఠ రాజకీయంగా ఎదగడానికి, తన పలుకుబడిని ప్రదర్శించడానికి మంత్రి నారా లోకేష్తో ఉన్న సాన్నిహిత్యాన్నే ప్రచారాస్త్రంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బెట్టింగ్ వ్యవహారంతో మంత్రికి ఎలాంటి సంబంధం ఉందా లేదా?అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాజకీయ పరిచయాలను అడ్డుపెట్టుకుని సాగించిన ఈ అక్రమ దందాపై పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది.
పోలీసుల గోప్యత.. మిగిలినవారేరి?
ఈ దాడి సమయంలో పలువురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, చివరకు ఇద్దరిపైనే కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన వారిని ఎందుకు విడిచిపెట్టారు? కేసు వివరాలను పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టాస్క్ఫోర్స్ వర్గాలకు, సైబర్ క్రైమ్ పోలీసులకు మధ్య నిందితుల సంఖ్యపై భిన్న సమాచారం రావడం కూడా అనుమానాలను బలపరుస్తోంది.
ఫోన్లలో మరో దందా గుట్టు?
స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను విశ్లేషిస్తున్న పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లతో పాటు, ఆన్లైన్ ద్వారా యువతులను ట్రాప్ చేసి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు బెట్టింగ్ బాస్ ఎవరు? ఆర్థిక లావాదేవీలు ఎవరి ఖాతాల నుంచి జరిగాయనేది తేలాల్సి ఉంది. రాజకీయ పలుకుబడి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లోకేష్ సన్నిహితుడినంటూ పరిచయం


