తాత్కాలిక రైతు సేవాకేంద్రం నుంచి ఎరువులు తీసుకుంటున్న రైతులు
ధర్మవరం అగ్రహారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు సేవా కేంద్రం
ఎస్.రాయవరం: గ్రామాల్లో గత ప్రభుత్వం నిర్మించిన రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)లు రైతుల పాలిట వరంలా మారాయి. గతంలో కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రాలకో, పొరుగు గ్రామాల్లోని పీఏసీఎస్ కార్యాలయాలకో వెళ్లి, విత్తనాలు, ఎరువుల బస్తాలను తెచ్చుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ కష్టాలను తీరుస్తూ.. రైతులకు గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేందుకు, సాగుకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకేలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని 28 గ్రామాలకు గాను 22 సచివాలయాల పరిధిలో 90 శాతం రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఇక్కడే భద్రపరిచి, సమయానికి అందిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. గ్రామస్థుల విరాళం
ధర్మవరం అగ్రహారంలో గత ప్రభుత్వంలోనే రైతు భరోసా కేంద్రానికి నిధులు మంజూరయ్యాయి. అయితే అధికారులు సరైన చొరవ చూపకపోవడంతో భవన నిర్మాణం ప్రారంభం కాలేదు. తరువాత అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. సీజన్ వచ్చేసరికి ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. స్థానికులంతా కలిసి విరాళాలు సేకరించారు. గ్రామంలో ఖాళీగా ఉన్న పాత బస్ షెల్టర్ భవనాన్ని తమ సొంత ఖర్చులతో తాత్కాలిక రైతు సేవా కేంద్రంగా మార్చారు. గ్రామస్తుల చొరవను చూసి అభినందించిన వ్యవసాయ అధికారులు, ప్రస్తుతం ఆ తాత్కాలిక కేంద్రంలోనే విత్తనాలు, ఎరువులను భద్రపరిచి రైతులకు పంపిణీ చేస్తున్నారు.
శాశ్వత భవనం నిర్మించాలని వినతి
గ్రామస్థాయిలోనే రైతులకు అన్ని సదుపాయాలు అందాలనే ఉద్దేశంతో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఆర్బీకేల వ్యవస్థ రైతులకు ఎంతో అవసరమని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక కేంద్రంతో ప్ర స్తుతానికి ఇబ్బంది తీరినప్పటికీ, తమ గ్రామంలో వెంటనే శాశ్వత రైతు సేవాకేంద్రం భవనాన్ని నిర్మించాలని ధర్మవరం అగ్రహారం రైతులు కోరుతున్నారు.
ధర్మవరం అగ్రహారం గ్రామస్తుల
అపూర్వ చొరవ


