నేడు చోడవరంలో జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
చోడవరం: ఈనెల 19వ తేదీన జిల్లా స్థాయి వైద్య, విజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావునాయుడు చెప్పారు. చోడవరంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో నైపుణ్యం, విజ్ఞానానికి మరింత పదును పెట్టేందుకు ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామన్నారు. మండలాలవారీగా అన్ని చోట్ల విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించామని, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితో ఈనెల 19వ తేదీన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశామన్నారు. చోడవరం జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో ఈ ప్రదర్శన జరుగుతుందని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 24 మండలాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి వివిధ విభాగాల్లో రూపొందించిన 216 నమూనాలు ఈ ప్రదర్శనలో ఉంచడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యాకమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు అంతా సహకరించి, ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈవో అప్పారావునాయుడు కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఈవో అప్పారావు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.


