పెండ్లి కావిడిని మాడ వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యం
అశ్వవాహనంలో స్వామివారి తిరువీధి సేవ
నక్కపల్లి: కోనేటిరాయుని కల్యాణానికి వేళయింది. ఉపమాక గరుడాద్రి పర్వతం మీద ఏకశిలపై వెల సిన లోకేశుని దివ్యకల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం వారు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి తిరుకల్యాణానికి గురు వారం రాత్రి అంకురార్పణ జరిగింది. స్వామివారి కల్యాణమండపంలో ఉభయ దేవేరులను ఉంచి, సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి ఉత్తర ఈశాన్య దిక్కు ప్రాంతానికి పుట్టమన్ను తెచ్చేందుకు తీసుకెళ్లారు. స్వామివారి కల్యాణానికి అందరూ ఆహ్వానితులేనంటూ గురువారం ఉదయం పెండ్లి కావిడిని ఉపమాక మాడ వీధుల్లో ఊరేగించారు.
ఆలయానికి చేరిన ఆభరణాలు
స్వామివారికి కోట్లాది రూపాయల విలువైన స్వర్ణాభరణాలు ఉన్నాయి. వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చల హారం, కాసులపేర్లు, మరకత మాణిక్యాలు, పగడాలు, కటిహస్తం, వజ్రాల కిరీటం, గొలుసులు.. ఇలా రకరకాల ఆభరణాలు ఉన్నాయి. వీటిని భద్రతా కారణాల రీత్యా విశాఖలోని ట్రెజరీ లో భద్రపరుస్తారు. ప్రతి ఏటా కల్యాణోత్సవాలకు తీసుకువచ్చి ఐదు రోజులపాటు అలంకరించి తిరిగి ఖజానాకు చేరుస్తారు. గురువారం భారీ బందోబస్తు మధ్య వీటిని ఆలయానికి తీసుకువచ్చారు.
వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు శ్రీకారం
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 150వ కల్యాణ మహాత్సవాలు గురువారం రాత్రి అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. గిరిజాంబ కొండ దిగువన ఉన్న పుట్ట వద్ద పేరంటాలు, పెద్దల సమక్షంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు ఆరోగ్యం బాగుండకపోవడంతో అతని అన్నయ్య దొరబాబు కుమారుడు శ్రీరామ్, దేవస్ధానం ఈవో శర్మ, టీటీడీ అర్చకుల సమక్షంలో వేడుకలు జరిగాయి. సన్నాయి మేళతాళాలు, డప్పులు, వాయిద్యాల నడుమ కొండపై నుంచి కొండ దిగువన ఉన్న పుట్ట వరకు ఊరేగింపుగా వచ్చి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఉపమాకలో ఘనంగా ఏర్పాట్లు
అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాలు
పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, దేవస్ధానం సిబ్బంది


