పెందుర్తి: సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనులకు వినియోగించే ఐరన్, కేబుల్ వైర్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.4.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయా వివరాలను క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు వెల్లడించారు. సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనుల నిమిత్తం పెందుర్తి మండలం నందవరపువానిపాలెం సమీపంలో ఐవోసీఎల్ సంస్థ ఐరన్, కేబుల్ వైర్లను నిల్వచేసింది. ఈ నెల 8న సైట్ ఇన్చార్జి తోట సునీల్రాజ్ సామగ్రి సరిచూడగా అందులో దాదాపు రూ.3 లక్షల విలువైన ఐరన్, కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు.
● గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుసంధానంగా నిర్మిస్తున్న సబ్బవరం–షీలానగర్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జేపీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నరవ వద్ద సెంటరింగ్ ప్లేట్లు, యూ జాకీలు, బేస్ జాకీలు భద్రపరిచింది. గత నెల 10న సైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ వంకా శివశంకర్ సామగ్రి పరిశీలించగా రూ.1.50 విలువైన సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా చోరీల విషయంలో ఫిర్యాదులు అందుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కొబ్బరితోట(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుప్పిలి)కి చెందిన అలపాన రెడ్డి(29), పూర్ణామార్కెట్ కల్లు పాకల(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా లోపెంట)కు చెందిన నాయన అసిరిబాబు(30), పూర్ణామార్కెట్ ప్రసాద్ గార్డెన్స్(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వెంకయ్యపేట)కు చెందిన దల్లి గోవింద్(29), 104 ఏరియాకు చెందిన పరపటి సంతోష్కుమార్(31) ఆయా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను బుధవారం నగరంలో మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారిని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ క్రైం సీఐ బి.తిరుమలరావు, పెందుర్తి క్రైం ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు బి.దేముడునాయుడు, ఎల్.తాతారావులను ఉన్నతాధికారులు అభినందించారు.


