సాక్షి, పాడేరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి క్రీడా మైదానంలో శనివారం నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆమె శుక్రవారం పరిశీలించారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళతో పాటు అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. విద్యార్థుల మార్చ్పాస్ట్ ప్రాక్టీస్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఉదయం 9 గంటలకు కలెక్టర్ టి. నిశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, పోలీసుల కవాతు, విద్యార్థుల మార్చ్పాస్ట్, అన్ని విద్యాలయాలకు సంబంధించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. అలాగే అన్ని శాఖల అధికారులు వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తలారిసింగి పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు.


