గొందిపాకలలో రైతులకు సూచలలిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్
చింతపల్లి: గిరిజన రైతాంగం నీటి ఎద్దడిని తట్టుకునే ఉద్యానవన పంటలపై ఎక్కువగా దృష్టి సారించాలని ఉద్యానవన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి. రాజశేఖర్ అన్నారు. శుక్రవారం మండలంలో ఎల్నినో ప్రభావంతో ఉద్యాన పంటలపై ప్రభావం, ఉద్యాన పంటల సమగ్ర యాజమాన్య పద్ధతులపై చేపడుతున్న ప్రత్యేక ప్రచార వారోత్సవాల సందర్భంగా గొందిపాకలు, పెదబరడ గ్రామాలలో గిరిజనులు సాగుచేస్తున్న ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు గిరిజన రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను సాగుపట్టాలన్నారు. ముఖ్యంగా రైతులు ఫారంపాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, మల్చింగ్ పద్ధతులను పాటించాలని సూచించారు. సమగ్రంగా పురుగు, తెగుళ్ల యాజమాన్య పద్ధతులను పాటించడంతో పాటు, భూసారాన్ని బట్టి ఎరువులను వినియోగించాలన్నారు. తక్కువ కాలపరిమితి గల ఉద్యానవన పంటల సాగును చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మి, వి.హెచ్.ఎ. గంగాభవాని, రామలక్ష్మి, ఆదర్శ రైతులు కుశలవుడు, కనకారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.


