సాక్షి, పాడేరు: విప్లవ వీరుడు, మన్యం ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు విగ్రహం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పాడేరు కేంద్రం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరును గిరిజన జిల్లాగా అవతరింపజేసిన విషయం తెలిసిందే. పాడేరు కలెక్టరేట్ ప్రారంభోత్సవం నాడు.. అప్పటి తొలి కలెక్టర్ సుమిత్ కుమార్, గౌరవ ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో ఆవిష్కరించిన అల్లూరి నిలువెత్తు విగ్రహం నేడు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మన్యం వీరుడి త్యాగాలను స్మరిస్తూ.. కలెక్టర్ టి. నిశాంతి ప్రత్యేక చొరవతో ఆ విగ్రహం, ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి, వేడుకలకు సిద్ధం చేశారు.


