కొయ్యూరు: మండలంలోని ఎం.భీమవరం పంచాయతీ వాలుగూడెం విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. డిప్యూటేషన్పై ఈ పాఠశాలలో నియమించిన ఉపాధ్యాయుడు రెండు రోజుల మాత్రమే విధులకు హాజరయ్యారు. అనంతరం ఆయన పాఠశాల ముఖమేచూడడం మానేశారు. మండలంలోని నడిపాలెం పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో అక్కడి ఉపాధ్యాయుడు అప్పారావును వేసవి సెలవుల అనంతరం 15 రోజుల తరువాత డిప్యూటేషన్పై వాలుగూడెం పాఠశాలలో నియమించారు. ఆయన కేవలం రెండు రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించి, అనంతరం రావడం మానేశారు. దీంతో ఈ పాఠశాలలో చదువుతున్న 49 మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవో సింహాచలానికి ఫిర్యాదు చేశారు. వాలుగూడెంతో పాటు సమీపంలో ఉన్న మూడు గ్రామాల పిల్లలు ఈ పాఠశాలలోనే చదువుతున్నారని, ఉపాధ్యాయుడు రాకపోవడంతో పాఠశాల మూతపడి వారు విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రాంబాబు తదితరులు మాట్లాడుతూ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమిస్తారని ఇప్పటి వరకు ఆశగా ఎదురు చూశామని, ఫలితం లేకపోయిందని తెలిపారు. తమ పాఠశాల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై ఎంఈవో సింహాచలం మాట్లాడుతూ డిప్యూటేషన్పై నియమించిన ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లలేదని చెప్పారు. మండలానికి 54 మంది ఆకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు కావాలని డీఈవోకు నివేదించామన్నారు.వారు వస్తే ఉపాధ్యాయుల కొరత తీరుతుందని తెలిపారు.
చదువుకు దూరమవుతున్న
49 మంది విద్యార్థులు


