పాడేరు: జీవో నంబర్ 3, గిరిజనుల హక్కులు, 1/70 చట్టం కోసం జిల్లాలో గిరిజనులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కూటమి నాయకులు కుట్రలకు పాల్పడుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రెండేళ్లుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నీతులు చెబుతూ కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఆ నెపాన్ని వైఎస్సార్సీపీపైకి నెట్టడం ఏంటని ప్రశ్నించారు. జీవో నంబర్ 3పై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి, పార్టీ తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తామని లేదా ప్రత్యామ్నాయ జీవో తెచ్చి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ గిరిజనులకే ఇస్తామని చంద్రబాబు నాయుడు అరకు ఎన్నికల సభలో హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి రెండున్నరేళ్లవుతున్నా పట్టించుకోలేదన్నారు. 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సడలింపులు కోరుతూ ఏకంగా 1,700 పిటిషన్లను సుప్రీంకోర్టులో గిరిజనేతరులు దాఖలు చేస్తే గిరిజనుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పిటిషన్ కూడా వేయలేదన్నారు. గిరిజన ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా బాకై ్సట్, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై సర్వేలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తోందని ఆరోపించారు. గిరిజనులు తమ హక్కులు, చట్టాల పరిరక్షణకు ఈనెల 17న మహా ఉద్యమం చేపడితే జిల్లాలో కూటమి నాయకులు ఎక్కడ దాక్కున్నారని, గిరిజనుల గోడు వీరికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కూటమి నాయకులను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జిల్లాలో కూటమి నాయకులకు మనుగడ కష్టంగా మారిందని, ఉనికి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ నిత్యం ప్రజల పక్షానే ఉంటుందని,గిరిజనులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలను నిత్యం కొనసాగిస్తుందన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు


