ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన జోలాపుట్టు జలాశయం నుంచి కొద్దిరోజులుగా ప్రాజెక్ట్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు జోలాపుట్టు నుంచి నీటి విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2750 అడుగులు కాగా గురువారం ఉదయానికి 2721.50 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజుకు 2736 అడుగుల నీరు ఉండేందని, గత ఏడాది కన్నా ప్రస్తుతం 15 అడుగులు నీరు తక్కువగా ఉందని జలాశయ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా జోలాపుట్టు జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న డుడుమ జలాశయానికి విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయ నీటి సామర్థ్యం 2590 అడుగులు కాగా ప్రస్తుతం 2584 అడుగులుగా నీటి మట్టంగా నమోదు అయింది.మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో 1,2,3,4,5,6 నంబరర్ల జనరేటర్ల సాయంతో 120 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.


