ఇద్దరి అరెస్టు
కొయ్యూరు: మండలంలోని చీడిపాలెం జంక్షన్ వద్ద రూ. 34.8 లక్షల విలువైన 69.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ కిషోర్ వర్మ చీడిపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బూదరాళ్ల వైపు నుంచి వస్తున్న ఒక ఆటోను పోలీసులు ఆపారు. పోలీసులను చూసి ఆటోలోని వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారయ్యారు.ఆటోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో 12 ప్యాకెట్లలో దాచిన 69.6 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి సామర్లకోటకు, అక్కడి నుంచి చైన్నెకి తరలించేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అరెస్ట్ అయిన వారిని ఒడిశా ప్రాంతానికి చెందిన తాలే కోటిబాబు, పడియేమి బచేల్గా గుర్తించారు. వీరి నుంచి రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.


