
డమ్మీగా మారిన ఈవో..!
ప్రస్తుత సింహాచలం దేవస్థానం ఈవో సెలవులో ఉండడంతో ఇన్చార్జిగా ఈవోగా కె.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. అయితే, సదరు దేవాలయ ఈవోను చందనోత్సవ వ్యవహరాల్లో నామమాత్రం చేశారనే విమర్శలున్నాయి. పాసుల జారీలో కానీ.. నిర్ణయాల్లో కానీ దేవాలయ ఈవోను డమ్మీ చేశారనే ఆరోపణలున్నాయి. పెత్తనమంతా రెవెన్యూ యంత్రాంగానిదే ఉంటోందని దేవదాయ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలతో పాటు ఎన్జీవోలకు కూడా టికెట్లను మంజూరు చేయాలంటే కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రావాల్సిందేనని దేవాలయ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. కనీసం వీరికి కూడా పాసులు ఇచ్చేందుకు తమ చేతుల్లో ఏమీ లేదని దేవాలయ అధికారులు పేర్కొంటున్నట్టు సమాచారం. కలెక్టరేట్కు వెళితే కనీసం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న ఈవో మరో వారం, పది రోజుల్లో వెళ్లిపోయే భావనలో ఉండటంతో.. ఆయన్ని పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా దేవాలయ అధికారులను, సిబ్బందిని నామమాత్రం చేసి అంతా కలెక్టరేట్ నుంచి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఆదేశాలే అమలవుతున్నాయనే విమర్శలు సింహాచలం కొండల చుట్టూ ప్రతిధ్వనిస్తుండటం గమనార్హం.