నెల్లూరు(లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తిని ఎస్పీ డా.అజిత వేజెండ్ల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోర్టులోని ఆయన చాంబర్లో కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
భక్తిశ్రద్ధలతో
‘రంగడి’ పవిత్రోత్సవాలు
నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం, హోమాలు, పవిత్ర సమర్పణలను వేదపండితులు విశేషంగా నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కనులపండువగా గోపురోత్సవం, భక్తిప్రపత్తులతో హోమాలు జరిగాయి. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు.
బీజేపీ నేతల నిరసన
నెల్లూరురూరల్: బీజేపీ నాయకులు కోటమిట్టలోని మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ సాదిక్ ఖాన్ను పూర్తిస్థాయిలో విచారించాలన్నారు. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనలో అతనికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కూడా ప్రజలకు తెలియజేయాలని కోరారు.
18వ డివిజన్లో
కమిషనర్ పర్యటన
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ సోమవారం 18వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. తొలుత హరనాథపురం ప్రధాన వీధుల్లో నూతనంగా నిర్మిస్తున్న కాలువల పనులను పరిశీలించారు. డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న భవనాలు, అదనపు అంతస్తులను గుర్తించి వాటికి నగరపాలక సంస్థ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. అనుమతులు ఉన్న నిర్మాణాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేసి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందేలా చూడాలన్నారు.


