● నల్లబ్యాడ్జీలతో కాంట్రాక్ట్ నర్సుల నిరసన
నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ శరత్బాబు మాట్లాడుతూ వైద్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ సౌకర్యం కల్పించడంతోపాటు రిక్వెస్ట్, మ్యూచ్వల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసులను జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓ, జీజీహెచ్ సూపరింటెండెంట్కు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ షేక్ షఫీ, సిస్టర్ రూత్ గ్రేస్, పి.వేణు, సుసన్న తదితరులు పాల్గొన్నారు.


