నెల్లూరు(అర్బన్): జిల్లాలో టీబీ (క్షయ) వ్యాధిని నిర్మూలించడమే ధ్యేయంగా వైద్యసిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కలిసి కృషి చేయాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్వలీ అన్నారు. ప్రధానమంత్రి ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సోమవారం నగరంలోని భక్తవత్సలనగర్లో ఉన్న డేమియన్ ఫౌండేషన్ కార్యాలయంలో క్షయ నివారణ సిబ్బందితో సమీక్ష జరిగింది. ఆయన మాట్లాడుతూ జబ్బు నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ప్రతి పీహెచ్సీ పరిధిలోనే మందులు అందజేస్తారన్నారు. అత్యంత నిరుపేదలుండే ప్రాంతాల్లో టీబీ లక్షణాలుండే వారిని గుర్తించి ఇంటి వద్దనే హ్యాండ్ మెషీన్తో ఎక్స్రే తీయించి డాక్టర్ ద్వారా పరిశీలించాలన్నారు. ఇందుకోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సమన్వయకర్త విజయకుమార్, టీబీ, హెచ్ఐవీ కో ఆర్డినేటర్ శ్రావణ్కుమార్, పబ్లిక్, ప్రైవేట్ మిక్స్ కో ఆర్డినేటర్ హరీష్, క్షయ నివారణ సూపర్వైజర్లు, చికిత్స ఆర్గనైజర్లు, భవ్య హెల్త్ కేర్ సిబ్బంది, ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


