నెల్లూరు(బారకాసు): పీజీఆర్ఎస్ వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైఓ నందన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మినీబైపాస్లో చేపల విక్రయదారులు, ఎన్టీఆర్ పార్కు వద్ద రకరకాల ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలతో రోడ్లు ఆక్రమణలకు గురైనట్లు చెప్పారు. వాహనదారులకు తీవ్రమైన అడ్డంకిగా మారుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీను నిర్వహించి రోడ్డు ఆక్రమణల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం వల్ల ప్రజా రవాణాకు ఇబ్బందులతోపాటు కాలువలు పూడుకుపోతున్నాయని పేర్కొన్నారు. కన్స్ట్రక్షన్, డెమాలిషన్ వ్యర్థాలను నగరపాలక సంస్థకు అప్పగించాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 9494018118కు సమాచారం అందిస్తే వ్యర్థాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.మొత్తం 50 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ రహంతుజానీ, ఈఈలు శేషగిరిరావు, చంద్రయ్య, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం టీపీఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


