నిర్మల్చైన్గేట్: సాగులో సమతుల్యత పాటించాల ని, పంట మార్పిడి విధానంపై వ్యవసాయ అధికా రులు విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సురర్శన్రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రాజెక్టుల పరిస్థితి, పంటల సాగు, ఎల్నినో ప్రభావం తదితర అంశాల పై నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో నీ టి నిల్వలు, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి..
ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరికి బదులుగా ఆయిల్పామ్, కంది, నువ్వులు, పత్తి తదితర ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. కొత్త పంటల సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
నిండుగా ప్రాజెక్టులు, చెరువులు..
నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ మూడు రోజులు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వేగంగా చేపడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా తాగునీటి సమస్య ఉండదన్నారు. రైతులు పంట మార్పిడి విధానాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తరిస్తోందని తెలిపారు.
తగ్గిన లోటువర్షపాతం...
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, గతంలో జిల్లాలో 38 శాతం లోటు వర్షపాతం ఉండగా, ప్రస్తుతం అది 6 శాతానికి తగ్గిందని తెలిపారు. జి ల్లాలోని 17 మండలాల్లో సాధారణ వర్షపాతం కురి సిందని తెలిపారు. ఇంద్రవెల్లి, భోరజ్, సిరికొండ, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాలు ప్రస్తు తం సాధారణ పరిస్థితికి చేరుకున్నాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో 5,93,670 ఎకరాల్లో పంటలు సాగయ్యాయని తెలిపారు. 4,37,698 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 56,751 ఎకరాలు పెరిగిందన్నారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు వ్యవసాయంతోపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయన్నారు. సమావేశంలో నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల, నిర్మల్, ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


