జగన్నాథుని నామస్మరణతో ఆదిలాబాద్ పురవీధులు మారుమోగాయి. శనివారం ఇస్కాన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరి జగన్నాథుని రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. సోదరుడు బలబద్ర, సోదరి సుభద్రలతో కలిసి కొలువుదీరిన ఆ దేవదేవుని రథాన్ని లాగేందుకు భక్తజనం పోటీ పడ్డారు. ముందుగా శ్రీ ప్రణవానంద ప్రభూజీ ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బద్ధంగా చీపుల్లను చేత పట్టి ఊడస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ రథయాత్రను ప్రారంభించారు. మథుర జిన్నింగ్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్, అశోక్రోడ్డు, గోపాలకృష్ణ మఠం, నేతాజీ చౌక్ మీదుగా శోభాయమానంగా సాగింది. మహిళలు, చిన్నారులు భజన సంకీర్తనలు చేయగా, యువతులు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. హరే రామ...హరే కృష్ణ, జై జగన్నాథ అంటూ జయజయ ధ్వానాలు చేస్తూ భక్తజనం పులకించిపోయారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పూరి జగన్నాథుని కథా శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ప్రమోద్కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్


