ఆదిలాబాద్టౌన్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన అట్రాసిటీ కేసుల దర్యాప్తు, విచారణలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థా యి సమీక్షకు హాజరయ్యారు. ముందుగా చైర్మన్, సభ్యులకు కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అధికా రులు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్, సభ్యులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసుల దర్యాప్తు, భూ సమస్యలు, రిజర్వేషన్ల అమలు, సబ్ప్లాన్ నిధుల వినియోగంపై శాఖలవారీగా సమీక్షించారు. అట్రాసిటీ కేసుల నమోదు, చార్జిషీట్ల దాఖలు, బాధితులకు పరిహారం చెల్లింపు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యాపథకం, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉపాధిహామీ అమలుపై అధికారులతో చర్చించారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పరిహారం, పునరావాసం, ఇతర సౌకర్యాలను సకాలంలో అందించాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా చివరి వారంలో సివిల్ రైట్స్ డే సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించి ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గురుకుల విద్యాసంస్థలను తరచూ తనిఖీ చేసి లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. పెండింగ్ నిధుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కామన్ మెనూ అమలు, ఉపకార వేతనాలు, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం, అంబేడ్కర్ ఓవర్సీస్, ఇందిరమ్మ, ఉపాధిహామీ పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని తెలిపారు. అనంతరం కమిషన్ వెంకటయ్య, సభ్యులను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. అంతకుముందు రిమ్స్లో చికిత్స పొందుతున్న భోరజ్ మండలం మాండగడకు చెందిన వాణిశ్రీని కమిషన్ చైర్మన్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఏఎస్పీ సాయిరుత్విక్ కొట్టే, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రూ, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవోలు జగదీశ్వర్రావు, మోహన్సింగ్, డీఎస్పీ జీవన్రెడ్డి, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


