ఆదిలాబాద్రూరల్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమై దాదాపు నెల కావస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరు కావడం లేదు. ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి తల్లి దండ్రులకు అవగాహన కల్పిస్తున్నా ఇంకా చాలా మంది పాఠశాల బాట పట్టని పరిస్థితి. దీంతో ఆ విద్యార్థులు చదువుపరంగా నష్టపోయే అవకాశం ఉంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఐటీడీఏ పరిధిలో 54 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 21 బాలికల పాఠశాలల్లో 7,165 మంది విద్యార్థినులు ఉన్నారు. 33 బాలుర పాఠశాలల్లో 7,665 మంది చదువుతున్నారు. మొత్తం 14,830 మందికి గాను ఇప్పటి వరకు 13,455 మంది హాజరయ్యారు. మరో 1,375 మంది హాజరుకావాల్సి ఉంది.
జూలై మొదటి వారంలోనే..
జూన్లోనే పాఠశాలలు ప్రారంభమైన్నప్పటికీ జిల్లాలో ఆ నెలలో 50 శాతం మంది కూడా హాజరు కాలేదు. ఈనెల మొదటి వారంలో మెరుగైనట్లు ఐటీడీఏ అధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోధ్యాయులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుండగా వివిధ కారణాలతో పంపించలేకపోతున్నట్లుగా వారు చెబుతున్నారని వివరిస్తున్నారు.
90 శాతంపైగా హాజరు..
ఇప్పటికే 90 నుంచి 95 శాతం మేర విద్యార్థులు హాజరయ్యారు. మిగతా వారు వివిధ కారణాలతో గైర్హాజరవుతున్నారు. వారు కూడా హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నాం.
– ప్రేమకళ, ఐటీడీఏ డీడీ


