breaking news
Maria Corina Machado
-
ట్రంప్ ఆశలు ఇక అడియాశలేనా?
గత ఏడాది(2025)లో నోబెల్ శాంతి బహుమతి పొందిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ట్రంప్కు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో, తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడం సంచలనం రేపింది.మచాడో నోబెల్ బహుమతిని ట్రంప్కు ఇచ్చేస్తారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని పంచుకోవడం, రద్దు చేయడం, బదిలీ చేయడం సాధ్యం కాదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీ తేల్చి చెప్పింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత, ఆ నిర్ణయం శాశ్వతంగా ఉంటుందంటూ కమిటీ పేర్కొంది. కాగా, నోబెల్ శాంతి బహుమతిని అందుకునేందుకు తనకంటే అర్హుడు ఈ చరిత్రలో ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఏమీ చేయకపోయినా ఆయనకు ఆ గౌరవం దక్కిందంటూ వ్యాఖ్యానించారు.వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో నోబెల్ గురించి శనివారం ట్రంప్ మరోసారి ప్రస్తావిస్తూ.. మాచాడో తన నోబెల్ బహుమతిని ఇవ్వాలనే ఆఫర్పై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో పట్టుబడి అమెరికాకు తరలించబడిన తర్వాత, అమెరికా–వెనిజులా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఆమె రావాలని అనుకోవడం మంచిదేనంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. నా దృష్టి అంతా ప్రజల ప్రాణాలు కాపాడటం పైనే ఉందన్న ట్రంప్ యుద్ధాలను ఆపడం ద్వారా కోట్లాది మందిని రక్షించానంటూ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. -
పంతం నెగ్గించుకున్న ట్రంప్
ఒక అగ్రరాజ్యపు దురాశ. సొంత పాలకుల నియంతృత్వ, పెడపోకడలు. ఫలితంగా దశాబ్దాలుగా నలిగిపోతూ సాగుతున్న వెనెజువెలా ప్రస్థానం కాస్తా, ఏకంగా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో తాజాగా మరో మలుపు తిరిగింది. అత్యాశ, అధికార లాలస నడుమ జరిగిన ఆరాట పోరాటాల్లో అక్కడి ప్రజల స్వేచ్ఛాకాంక్షలు మరోసారి సమాధయ్యాయి. ట్రంప్ విపరీత మనస్తత్వం దృష్ట్యా ఇకపై వెనెజువెలా భవితవ్యం ఎలా ఉండనుందన్నది ఎవరి అంచనాలకూ అందని పరిస్థితి... ఆది నుంచీ అంతంతే... అమెరికాతో వెనెజువెలా సంబంధాలు ముందునుంచీ ఉప్పూ నిప్పుగానే సాగుతూ వస్తున్నాయి. వెనెజువెలాలోని అపార చమురు నిల్వలపై అమెరికాకు తొలి నుంచీ కన్నుంది. అగ్రరాజ్యపు చమురు దోపిడీని 1999లో వెనెజువెలా అధ్యక్షుడైన హ్యూగో చావెజ్ అడ్డుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలువారాయి. నాటినుంచీ పరిస్థితి క్రమంగా దిగజారుతూనే వస్తోంది. వెనెజువెలాపై అమెరికా ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ, వాటిని నానాటికీ పెంచేస్తూ వస్తోంది. తొలుత చావెజ్, ఆ తర్వాత తాజాగా పదవీచ్యుతుడైన నికొలస్ మదురో ఇద్దరూ నియంతృత్వ పోకడలతోనే పాలించారు. దాంతో పాతికేళ్లకు పైగా దేశం తిరోగమన బాటలోనే సాగుతూ వస్తోంది. అమెరికాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న డ్రగ్ కార్టెల్స్ మూలాలన్నీ వెనెజువెలాలోనే ఉన్నాయన్నది ట్రంప్ ఆరోపణ. ఇది చాలదన్నట్టు వెనెజువెలా నుంచి తమ దేశంలోకి జనం విపరీతంగా వలస వచ్చిపడుతున్నారంటూ కొంతకాలంగా ఆయన మండిపడుతున్నారు. డ్రగ్స్ మోసుకెళ్తున్నాయనే సాకుతో కొన్నాళ్లుగా వెనెజువెలా చమురు నౌకలను అడ్డుకుంటూ, పేల్చేస్తూ వస్తున్న అమెరికా చివరికి తాజాగా అధ్యక్షుడే లక్ష్యంగా సైనిక చర్యకే దిగి భార్యాసమేతంగా నిర్బంధంలోకి తీసుకుంది. వ్యతిరేకులతో దోస్తీ! వెనెజువెలా విషయంలో అమెరికా దూకుడును అడ్డుకోవడానికి ఆ దేశాధ్యక్షులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. చావెజ్ తన హయాంలో యూఎస్ వ్యతిరేక శక్తులైన రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో చెలిమి చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారకుండా చూసుకోగలిగారు. అలా తనపై జనాగ్రహం ప్రబలకుండా జాగ్రత్త పడ్డారు. చమురు విక్రయాలతో వచ్చే మొత్తాలతో దేశంలో పేదరికాన్ని చాలావరకు తగ్గించారు. కానీ మదురోలో ఆ ముందుచూపు లోపించిందంటారు పరిశీలకులు. ఆయన హయాంలో దేశంలో అన్ని రంగాల్లోనూ పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇటు ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. అటు ట్రంప్ రాకతో అమెరికా దూకుడు పెరిగింది. దాంతో రాజకీయంగానే గాక ఆర్థికంగానూ వెనెజువెలా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక దశలో దేశంలో ఆహార నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. దాంతో బతుకుదెరువు కోసం జనం భారీగా దేశం వీడటం పరిపాటిగా మారింది. గత పదేళ్లలో కోటిమందికి పైగా విదేశాల బాట పట్టినట్టు అంచనా. విచ్చలవిడిగా పెరిగిపోయిన అధికారుల అవినీతిని అదుపు చేయడం మదురో తరం కాలేదు. దీనికితోడు వెనెజువెలా చమురు అమ్మకాలన్నింటినీ అమెరికా దాదాపుగా అడ్డుకుంది. దాంతో ప్రధాన ఆదాయ వనరు మూసుకుపోయి మదురో సమస్యలు రెట్టింపయ్యాయి. కొంతకాలంగా చైనా వంటి దేశాలకు కారుచౌకగా చమురు విక్రయించుకుంటూ నెట్టుకొస్తున్న పరిస్థితి. అంతర్గత సమస్యలు ఇలా చేయి దాటుతుండగానే ట్రంప్ ఒక్కసారిగా రూటు మార్చి వెనెజువెలాపై గత సెప్టెంబర్ నుంచే సైనిక చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనెజువెలా గగనతలాన్ని మూసేస్తున్నట్టు గత నవంబర్లో ప్రకటించారు. వెనెజువెలా చుట్టూ సైన్యం మోహరింపులను పెంచేశారు. చివరికి మదురోను క్రిమినల్గా పేర్కొనడమే గాక, ఆయన్ను పట్టిస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల నజరానా ప్రకటించారు. మచాడో ఫ్యాక్టర్! మదురో దంపతులను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుందన్న వార్తలపై వెనెజువెలాలో ఆగ్రహావేశాలు దేవుడెరుగు, పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కావడం లేదు. ఇది మదురో స్వయంకృతమే అయినా, ఆయన పట్ల జనంలో నెలకొన్న వ్యతిరేకతను ఆగ్రహావేశాలుగా మార్చడంలో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో పాత్ర కీలకమే. మదురో హయాంలో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. దీనిపై అంతర్జాతీయ సంస్థలన్నీ గగ్గోలు పెట్టే పరిస్థితి. మదురోకు వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా రాత్రికి రాత్రే మాయం కావడం, తీవ్ర నిర్బంధానికి గురవడం షరామామూలుగా మారింది. అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన మచాడో ప్రజా గళంగా మారారు. మదురో నియంతృత్వ పోకడలపై ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ప్రజల సొత్తయిన అపార వనరులన్నింటినీ మదురో, ఆయన అనుయాయులు అయినకాడికి దోచుకుంటున్నారంటూ ఆమె చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలకు ప్రజల్లో గొప్ప స్పందన వచ్చింది. చూస్తుండగానే మచాడోకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం ఖాయమనే దాకా వెళ్లింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన మదురో, మచాడోపై హాస్యాస్పదమైన అవినీతి, దాంతోపాటు దేశద్రోహం తదితర ఆరోపణలు మోపారు. చివరికి ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా అనర్హత వేటు వేయించారు. ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ తదితరాల సాయంతో తిరిగి ఎన్నికయ్యారు. అవి అత్యంత ఏకపక్ష ఎన్నికలంటూ అంతర్జాతీయంగా విమర్శలు రేగినా పట్టించుకోలేదు. మచాడోపై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. దాంతో ప్రాణరక్షణ కోసం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది తనకు ప్రకటించిన నోబెల్ శాంతి బహుమానం అందుకునేందుకు మారువేషంలో నార్వే వెళ్లే ప్రయత్నంలో మచాడో పడవ ప్రమాదానికి గురై గాయపడ్డారు. అమెరికా దన్ను మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
2025: ట్రంప్ నామ సంవత్సరం
కాలం నిజంగానే మాయల మరాఠీ. రెప్పపాటే అనిపిస్తుంది గానీ చూస్తుండగానే శరవేగంగా సాగిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. మంచీ చెడుల మిశ్రమ అనుభూతులు పంచి 2025 త్వరలో వీడ్కోలు చెప్పనుంది. ఈ సంవత్సరంలో ఎంతోమంది ప్రముఖులు మెరుపులు మెరిపించారు. కొందరు మరకలు అంటించుకుని తల దించుకున్నారు. ఇంకొందరు అనన్య సామాన్యమైన సాహసాలు, రికార్డులతో ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. అలా 2025లో వార్తల్లో వ్యక్తులుగా నిలిచి అందరి నోళ్లలోనూ నానిన టాప్ 10 ప్రముఖుల గురించి ఒకసారి చూద్దాం...తంపులమారి (డొనాల్డ్ ట్రంప్) నిస్సందేహంగా 2025 ట్రంప్ నామ సంవత్సరమే అని చెప్పాలి. మీడియా వ్యతిరేకత, దు్రష్పచారాల మోత తదితరాలను సమర్థంగా కాచుకుంటూ 78 ఏళ్ల లేటు వయసులో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఔరా అనిపించారు. కానీ ఈ ఏడాది మొదట్లో పీఠమెక్కింది మొదలు రోజుకో ఆకస్మిక నిర్ణయంతో దేశాల గుండెల్లో అక్షరాలా రైళ్లు పరుగెత్తించారు. ముఖ్యంగా ఆయన ఎడాపెడా బాదిన టారిఫ్ల ధాటికి భారత్ తో సహా చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరే అయ్యాయి. అయితే వాటిని అంతే వేగంగా తగ్గించడం, రద్దు చేయడం వంటి చర్యలతో ట్రంప్ నవ్వులపాలు కూడా అయ్యారు. అమెరికాతో పరువుతో పాటు అగ్ర రాజ్య అధ్యక్ష పీఠం హుందాతనాన్నీ తన ప్రవర్తనతో పలుమార్లు పలుచన చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ఇప్పటికి కనీసం 75 సార్లకు పైగా ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ఖండించినా, పాక్ కాళ్లబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయంలో సెంచరీ కొట్టడమే ట్రంప్ లక్ష్యం కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలాయి. రష్యా–ఉక్రెయిన్, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాలను కూడా చిటికెలో ఆపేస్తానంటూ బీరాలు పలికినా అవిప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గాజాను స్వా«దీనం చేసుకునేందుకు, వెనిజులాలోని చమురు నిల్వలను చెర పట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా కాక రేపుతున్నాయి. రెండో టర్ములో ఇంకా ఏడాదైనా పూర్తవకుండానే ఇన్ని చుక్కలు చూపిన తంపులమారి ట్రంపు 2026లో ఇంకెంత విశ్వరూపం చూపుతారో చూడాలి!నిప్పులు చిమ్మి... (ఎలాన్ మస్క్) ఈ ప్రపంచ కుబేరునికి 2025 అక్షరాలా ఒక పీడకలగా మిగిలిపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ తో కుదిరిన దోస్తీ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. దాంతో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకంటూ ట్రంప్ తనకు అప్పగించిన డోజ్ సారథ్యం కూడా అటకెక్కింది. చూస్తుండగానే ట్రంప్ తో మస్క్ విభేదాలు రచ్చకెక్కాయి. వారి రచ్చ నిత్యం వార్తల్లో నిలిచింది. దాంతో మస్క్ కంపెనీలు ఎక్స్, టెస్లా షేర్లు ఈ ఏడాదంతా భారీగా నేల చూపులే చూశాయి. కాకపోతే, ఏదో ఒక రూపంలో నిత్యం పతాక శీర్షికల్లో మాత్రం నిలవడం ఒక్కటే ఆయనకు ఊరట!నిరసన పతాక (మరియా కొరీనా మచాడో) వెనిజులా విపక్ష నేత. మదురో నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసిన మడమ తిప్పని పోరాటానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వచ్చి వరించింది. దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపే పోరాటంలో అవసరమైతే ప్రాణార్పణకు కూడా సిద్ధమంటూ కొన్నాళ్ల క్రితం ఆమె చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంది. ఆమెకు నోబెల్ బహుమానం నేపథ్యంలో వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘన, మదురో నియంతృత్వం తదితరాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ట్రంప్ ను వెనక్కి నెట్టి మరీ ఆమె నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడం విశేషం. అయితే, ’వెనిజులా ప్రజాస్వామిక పోరాటానికి ఇస్తున్న నిరంతర మద్దతుకు’ గాను ఆమె తన పురస్కారాన్ని ట్రంప్ కు అంకితం చేయడం విశేషంగా నిలిచింది. మచాడో తరఫున ఆమె కూతురు ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.కుట్రలకు బలి (షేక్ హసీనా)బంగ్లాదేశ్ లో తెర వెనక కుట్రలకు బలైన మరో నేతగా నిలిచిన మాజీ ప్రధాని. భారత్ తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించడమే ఆమె పాలిట శాపమైంది. విద్యార్థులు, యువత మాటు మతోన్మాద, భారత వ్యతిరేక శక్తులు ఆజ్యం పోసిన అల్లర్లకు ప్రధాన లక్ష్యంగా మారారు. ప్రధాని పదవిని, దేశాన్ని వీడి భారత్ కు పారిపోయి వచ్చారు. అనంతరం పలు నేరాలపై అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష తో సహా పలు కఠిన శిక్షలు విధించాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ గుర్తింపు కూడా రద్దయింది. 15 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన హసీనా ఇప్పుడు 78 ఏళ్ల వయసులో పొరుగు దేశంలో చివరి రోజులు గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు. నారీ శక్తులు (వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి) నారీ శక్తికి ప్రతిరూపాలు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ లో మన సైన్యం సాగించిన విధ్వంసం తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరి స్తూ 3 రోజుల పాటు ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించారు. పాక్ తప్పుడు ప్రచారాలను రుజువులతో సçహా ఎండగట్టారు. యుద్ధరంగంలోనే గాక మీడియా వార్ లో కూడా భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలిపారు. దాంతో వారి పేర్లు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అంతర్జాతీయ సైనిక కవాతులో భారత దళానికి సారథ్యం వహించిన తొలి మహిళా ఆఫీసర్ అన్న రికార్డు సోఫియాది. కాగా వైమానిక దళంలో ఉజ్వలమైన కెరీర్ తో దేశ మహిళలకు స్పూర్తినిచ్చారు వ్యోమిక.వ్యోమ వీరుడు (శుభాంశు శుక్లా) ఆక్సియం – 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో కాలు పెట్టిన రెండో భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఈ ఏడాది మన నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పేర్లలో చేరారు. వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు అంతరిక్ష యాత్ర దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆ రంగం పట్ల ఎనలేని ఆసక్తిని పెంచింది. జపాన్లో నారీ భేరి (సనాయే టకైచీ) ఈ అక్టోబర్ లో జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాజకీయ రంగంలో స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సంప్రదాయం ప్రబలంగా ఉన్న జపాన్ లో ఇది నిజంగా అనూహ్యమే. అయితే టకైచీ కేబినెట్ మాత్రం పూర్తిగా పురుషులతోనే కిటకిటలాడిపోవడం విశేషం. దాంతో, స్త్రీ శక్తిపరంగా నిజమైన మార్పులను ఊహించిన వారంతా ఆశాభంగమే చెందారు.నూతన సారథి (పోప్ లియో 14) పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం సుదీర్ఘ ఎంపిక ప్రక్రియ అనంతరం వాటికన్ పగ్గాలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ కాథలిక్కులకు సారథిగా గత మే నెలలో కొలువుదీరారు. అమెరికా ఖండం నుంచి వచ్చిన తొట్ట తొలి పోప్ గా కొత్త చరిత్ర సృష్టించారు.అప‘హాస్యం’ (సమయ్ రైనా, రణ్ వీర్ అలహాబాదియ) హాస్యం కాస్తా శ్రుతి మించితే ఏమవుతుందో ఫేమస్ యూట్యూబర్ రణ్ వీర్, స్టాండప్ కమెడియన్ రైనా వివాదం నిరూపించింది. తల్లిదండ్రులు, పిల్లల గురించి లైంగికపరంగా అత్యంత అసభ్యమైన కామెంట్లు, దివ్యాంగుల గురించి చౌకబారు వ్యాఖ్యలతో ప్రసారమైన వీరి పాడ్ కాస్ట్ లు అందరి ఆగ్రహానికి గురయ్యాయి. చివరికి విషయం అంటున్న న్యాయస్థానం దాకా చేరింది. కోర్టు వాళ్లకు పదేపదే అక్షింతలు వేయాల్సి వచ్చింది. క్రియేటివ్ ఫ్రీడం పేరిట వెర్రితలలు వేసే పోకడలను భారత సమాజం హర్షించబోదని ఈ ఎపిసోడ్ మరోసారి చాటింది.కాసుల వర్షమే (టేలర్ స్విఫ్ట్) సూపర్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ ఏడాది అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె ’ఎరాస్’ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సింగిల్ టూర్ గా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో భాగంగా స్విఫ్ట్ ఏకంగా ఐదు ఖండాల్లో 149 షోలు చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దాంతో ’ఎరాస్’ షో దాదాపుగా 200 కోట్ల డాలర్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మకు బదులు అమ్మాయి
ఓస్లో: వెనెజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సాహసి, ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో.. ఆ నిప్పుకణిక లేకుండానే.. నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం బుధవారం ఓస్లోలో జరిగింది. భయంకరమైన పరిస్థితుల నడుమ రాలేకపోయినప్పటికీ, ఆమె కూతురు అనా కొరినా సోసా.. వేదికపై తల్లి తరపున ఆ చారిత్రక గౌరవాన్ని స్వీకరించారు. మచాడో ఈ ఏడాది జనవరి 9 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. అదేరోజు, ఆమె వెనెజులా రాజధాని కారకాస్లో తన మద్దతుదారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. త్వరలో మనతో మారియా.. నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్, జోర్జెన్ వాట్నే ఫ్రైడ్నెస్ సభలో చేసిన వ్యాఖ్యలు ఆహూతులను కదిలించాయి. ‘మారియా కొరినా మచాడో ఈ రోజు వేడుకకు హాజరయ్యేందుకు తన శక్తి మేరకు ప్రయతి్నంచారు. ఆమె రాలేకపోయినా, సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించడానికి ఎంతో సంతోíÙస్తున్నాం. ఆమె త్వరలోనే ఓస్లోలో మనతో ఉంటారు’.. అని ప్రకటించగానే సభ చప్పట్లతో దద్దరిల్లింది. ముందుగా నోబెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, మచాడో ప్రతినిధి ఆమె రాలేకపోతున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా మచాడో కుమార్తె అనా కొరినా సోసా.. తన తల్లి స్థానాన్ని అలంకరించారు. ఈ బహుమతి వెనెజులా ప్రజలందరిది నోబెల్ వెబ్సైట్లో విడుదలైన మచాడో ప్రసంగం ఆద్యంతం ఉద్వేగాన్ని నింపింది. ‘నేను ఓస్లో చేరుకోవడానికి ఎందరో ప్రాణాలను పణంగా పెట్టారు. వారికి నేను కృతజ్ఞురాలిని. ఈ గుర్తింపు వెనెజులా ప్రజలకు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది’.. అన్న ఆమె గొంతులో పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ‘ఈ బహుమతి మొత్తం వెనెజులా ప్రజలందరిది. నేను రాగానే, రెండేళ్లుగా చూడని నా కుటుంబ సభ్యులను, నా పిల్లలను కౌగిలించుకుంటాను’.. అని ఉద్వేగంతో ఆమె చెప్పారు. ఐదుగురూ నిర్బంధంలోనే.. గతంలో కూడా ఐదుగురు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు (నర్గెస్ మొహమ్మది–2023, అలెస్ బియాలియాట్సి్క–2022, లియు జియాబో–2010, ఆంగ్ సాన్ సూ కీ–1991, కార్ల్ వాన్ ఒసియెట్జీ్క–1935) నోబెల్ అవార్డు ప్రకటించే సమయానికి జైలులో లేదా నిర్బంధంలో ఉండటం గమనార్హం. -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
‘ఆమె అలా అనేసి ఉండొచ్చు..’ నోబెల్ దక్కకపోవడంపై స్పందించిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు(Trump reacts On Nobel Miss). వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఆ గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు గతంలో తాను పలు సందర్భాల్లో సహాయం చేశానని ట్రంప్ అన్నారు. అలాగే, తన నాయకత్వంలో ఏడు యుద్ధాలను ముగించానని.. అందుకోసమైనా తనకు నోబెల్ రావాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి(Maria Corina Machado) ఇవాళ నాకు ఫోన్ చేశారు. మీ గౌరవార్థమే నేను ఈ బహుమతిని అందుకున్నానని, మీరు దీనికి అన్నివిధాల అర్హులు అని ఆమె నాతో అన్నారు. అప్పుడు.. అలాగైతే నాకే ఇవ్వండి అని మాత్రం నేను అనలేదు. కానీ, ఆమె అలా అనేసి ఉండొచ్చు.. అంటూ సరదా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. మరియా కొరీనా మచాడోకు గతంలో ఎన్నోసార్లు నా సాయం అందుకుంది. వెనిజులా సంక్షోభ సమయంలో ఎంతో సహాయం చేశా. ఏదైతేనేం లక్షల మందిని రక్షించా.. అందుకు సంతోషంగా ఉంది’’ అని ట్రంప్ వైట్హౌజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ వస్తుందని చెప్పారు. కానీ అది పెద్ద వ్యవహారం. అయినా నేను ఏడు యుద్ధాలు ఆపాను. అందుకోసమైనా తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. మచాడో తన నోబెల్ బహుమతిని వెనిజులా ప్రజలకు, ట్రంప్కు అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనిజులా ప్రజల బాధలకు, అలాగే మా ఉద్యమానికి ట్రంప్ ఇచ్చిన కీలక మద్దతుకు ఈ బహుమతిని అంకితం చేస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఆమె ఓ కృతజ్ఞత పోస్ట్ ఉంచారు. అయితే.. ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై వైట్ హౌస్ భగ్గుమంది(White House Slams Nobel Committee for Trump Peace Prize Miss). నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ప్రాధాన్యంగా చూసింది అని విమర్శించింది. ఈ మేరకు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ మానవతావాది. ఆయనకు మంచి హృదయం ఉంది. కానీ, నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందని ఇది నిరూపించింది. అయినా కూడా ట్రంప్ శాంతి ఒప్పందాలు చేయడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను రక్షించడం ఆపబోరు అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చైనాపై పెద్దన్నకు కోపమొచ్చింది! నవంబర్ 1 నుంచి.. -
ట్రంప్కు నోబెల్ నిరాశ
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని బలవంతంగానైనా సాధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చివరకు భంగపాటే ఎదురయ్యింది. తానే ప్రపంచంలో అతిపెద్ద శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపి ప్రపంచంలో శాంతిని నెలకొల్పానని, అందువల్ల తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న ఆయన వాదనను నోబెల్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు ప్రకటించటంతో ట్రంప్ కార్యవర్గంపై నోబెల్ కమిటీపై అక్కసు వెళ్లగక్కింది. నోబెల్ కమిటీ అసలైన శాంతి పరిరక్షకులకంటే రాజకీ యాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించింది. మరోవైపు ‘మీడియా ప్రచారాన్ని నమ్మి నోబెల్ ఇవ్వం’ అని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ కోసం ట్రంప్ డిమాండ్నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచే దానిపై మనసు పారేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఏకంగా తనకు నోబెల్ పురస్కారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. తనకు ఆ పురస్కారం రాకపోవటంకంటే తన రాజకీయ ప్రత్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇవ్వటమే ట్రంప్ను అధికంగా మనోవేదనకు గురిచేస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ఈ ఏడాది మొదట్లో అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆయన నోబెల్ శాంతిబహుమతిపై కన్నేశారు. పలు దేశాలను బెదిరించి మరీ తనకు నామినేషన్ వేయించుకున్నారు. పది నెలల తన పాలనా కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని, ఇంతకంటే శాంతి ప్రదాత ఎవరు ఉంటారని ప్రశ్నిస్తూ వచ్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్లేనని ఇటీవలే వ్యాఖ్యానించారు. పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడా ఆయన దీనిపై స్పందించారు. ‘ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ పురస్కారం ఇచ్చారు. అమెరికాను ధ్వంసం చేసినందుకు ఆయనకు ఇచ్చారు. సరే.. వాళ్లు ఇప్పుడు ఏం చేయగలరో చేయనివ్వండి. ఏ నిర్ణయం ప్రకటించినా మంచిదే. దానికోసం (అవార్డు కోసం) నేను పనిచేయలేదు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే నేను ఇదంతా (యుద్ధాలను ఆపటం) చేశాను’అని గురువారం తెలిపారు. నోబెల్ కోసం సొంత టీమ్తో ప్రచారం చేయించుకున్న ట్రంప్.. ఈ ఏడాది జూలైలో ఏకంగా నార్వే ఆర్థికమంత్రి జెన్స్ స్టాల్టె్టన్బెర్గ్కు స్వయంగా ఫోన్ చేసి తనకు నోబెల్ ఇవ్వకుంటే టారిఫ్లు తప్పవన్నట్లు మాట్లాడారని నార్వే మీడియా పేర్కొంది.గడువు ముగిసిన తర్వాత నామినేషన్లుఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఫిబ్రవరి 1వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసిపోయింది. ట్రంప్ తరఫున అనేక నామినేషన్లు వచ్చినప్పటికీ, చాలావరకు ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చినవే ఉన్నాయి. ఈ ఏడాది మేలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాక్ను ట్రంప్ చేరదీసి భరోసా ఇవ్వ టంతో.. ఆ తర్వాత పాకిస్తాన్.. ట్రంప్కు నోబెల్ శాంతిపురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇజ్రాయెల్తో కూడా బ లవంతంగా గత నెలలో ట్రంప్ నామి నేషన్ ఇప్పించుకున్నారు. అయితే, ఈ పురస్కా రం కోసం ట్రంప్ యంత్రాంగం గత ఏడాది డిసెంబర్ నుంచే ప్రచారం మొద లుపెట్టింది. అందుకోసం అధ్యక్ష కార్యాల యం ఓవల్ ఆఫీస్నే కేంద్రంగా చేసు కోవటం గమనార్హం.నోబెల్ కమిటీపై వైట్హౌస్ ఫైర్ ట్రంప్కు నోబెల్ పురస్కారం ఇవ్వకపోవటంపై అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెంగ్ అక్కసు వెళ్లగ క్కారు. ‘శాంతి ఒప్పందాలు కుదురుస్తూ, యుద్ధాలు ఆపుతూ, ప్రజల ప్రాణాలు కాపాడే పనిని అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనది గొప్ప మానవతా హృదయం. తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగల ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండదు. నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది’అని విమర్శించారు. అయితే, శాంతి పురస్కా రానికి అభ్యర్థి ఎంపికపై నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్డాన్ స్పష్టత ఇచ్చారు. ‘నాకు తెలిసి ఈ కమిటీ ఇలాంటి ప్రచారాలు, మీడియా రిపోర్టులను చాలా చూసే ఉంటుంది. శాంతి స్థాపన కోసం అది చేశాం, ఇది చేశామని పేర్కొంటూ మాకు ఏటా వేల లేఖలు వస్తాయి. నోబెల్ పురస్కా రాలు పొందిన గొప్ప వ్యక్తుల చిత్రపటాలతో నిండిన ఓ గదిలో ఈ కమిటీ కూర్చుని చర్చిస్తుంది. ఆ గది సమగ్రత, ధైర్యసాహసాలతో నిండి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ సేవలు, ఆయన రాసిన విల్లులోని అంశాల ఆధారంగానే మేం నిర్ణయాలు తీసుకుంటాం’అని స్పష్టంచేశారు. -
ప్రజాస్వామ్య గళానికి శాంతి నోబెల్
ఓస్లో: ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో (57)కు లభించింది. ఓస్లోలో నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ‘చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య అగ్నిజ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు’అని మచాడోను నోబెల్ కమిటీ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఎంత బలంగా వాదించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశే ఎదురయ్యింది. నిర్బంధాలను ఎదిరించి నిలిచిన నేతకమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో పోరాడుతున్నారు. నికొలాస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తున్నారు. దీంతో ఆమెపై మధురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి వెళ్లిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. గత సంవత్సరం వెనెజువెలాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు మదురోకు పోటీగా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు మరియా ప్రకటించారు. కానీ, ఆ దేశ ఎన్నికల సంఘం ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. దీంతో ఆమె మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గోంజాలెజ్కు మద్దతు పలికారు. కానీ, ఎన్నికల్లో మదురో 51.95 శాతం ఓట్లు సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మదురో వరుసగా మూడోసారి అధ్యక్షుడ య్యారు. ఆ వెంటనే ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపారు. దీంతో చాలామంది దేశం విడిచి వెళ్లిపోవటమో, అజ్ఞాతంలోకి వెళ్లటమో జరిగింది. మరియా కూడా ఏడాది కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. గోంజాలెజ్ స్పెయిన్లో రాజకీయ ఆశ్రయం పొందారు. అయితే, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోంజాలెజ్ 67 శాతం ఓట్లు సాధించి స్పష్టమైన విజయం సాధించారని మరియా ఎన్నికల తర్వాత వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇంజనీర్ నుంచి రాజకీయ నేతగామరియా మచాడో వెనెజువెలా రాజధాని కారకాస్లో అక్టోబర్ 7, 1967లో జన్మించారు. ఇండస్ట్రియల్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరమే ఆమె రాజకీయ హక్కులు, ఎన్నికల పర్యవేక్షణ కోసం సుమటే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా వెనెజువెలాలో ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ‘బుల్లెట్ల స్థానంలో బ్యాలెట్ను ప్రోత్సహించటమే నా లక్ష్యం’అని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మచాడో వెనెజువెలా కులీన (ప్రభువర్గం) వర్గానికి చెందినవారు. వెనెజువెలా మూడో మార్వి్కజ్ ఆఫ టోరో (ఆ దేశంలో ప్రభువులకు ఇచ్చే బిరుదు) సెబాస్టియన్ జోష్ ఆంటోనియో రోడ్రిగేజ్ డెల్ టోరో యే అసానియో వారసురాలు. ఆ దేశ ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు ఎడ్వార్డో బ్లానో ఆమెకు ముత్తాత అవుతారు. ఆమె ఆండ్రెస్ బెల్లో క్యాథలిక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చది వారు. ఇన్స్టిట్యూటో డి ఎస్టుడియోస్ సుపీరియరెస్ డి అడ్మినిస్ట్రాసియోలో మాస్టర్స్ చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం. 1992లో ఈటెనా ఫౌండేషన్ను స్థాపించారు. అయితే, 2002 నుంచి సుమటే కార్యక్రమాలతో ఆమెకు దేశంలో మంచి పేరు వచ్చింది. 2011 నుంచి 2014 వరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం ‘వెంటే వెనెజువెలా’రాజకీయ పార్టీకి సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున ఆమె 2012లోనే అధ్యక్ష బరిలో దిగారు. కానీ, ప్రైమరీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. 2023లో మరోసారి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా జరుగు తున్న ప్రజాస్వామ్య పోరాటాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.ఒక అసాధారణ మహిళమరియా మచాడో సేవలను నోబెల్ కమిటీ గొప్పగా ప్రశంసించింది. ‘ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ పౌర సాహసికుల్లో మచాడో ఒకరు’అని కొనియాడింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నారని జోర్డాన్ వాట్నీ పేర్కొన్నారు. ఓస్లోలో ఈ అవార్డు ప్రకటించిన సమయంలో వెనెజువెలాలో రాత్రి సమయం కావటంతో ఆమె ఒక గుర్తు తెలియని ప్రాంతంలో నిద్రపోతున్నారు. నోబెల్ కమిటీ సభ్యులు ఆమెకు నేరుగా ఫోన్ చేసి విషయం చెప్పగానే షాక్కు గురయ్యారు. ‘దేవుడా.. నాకు మాటలు రావటం లేదు. ఇది ఒక ఉద్యమం, మొత్తం సమాజం సాధించిన ఫలితం ఇది. నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే. వ్యక్తిగతంగానే ఈ పురస్కారానికి నేను అర్హురాలిని కాదు’అని పేర్కొన్నారు. మచాడోకు నోబెల్ పురస్కారం రావటంపై వెనెజువెలాలోని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుంటే, మదురో మద్దతు దారులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ‘దేశంలో పరిస్థితిని మెరుగుపర్చటం ఎలాగో నాకు తెలియదు కానీ, నోబెల్ శాంతి పురస్కారానికి ఆమె (మచాడో) మాత్రం సంపూర్ణంగా అర్హురాలు’అని సాండ్రా మార్టినెజ్ అనే 32 ఏళ్ల మహిళ సంతోషం వ్యక్తంచేశారు. -
ట్రంప్కు దక్కని నోబెల్!
ప్రకటించటానికి ముందే రివాజుకు భిన్నంగా అందరి నోళ్లలోనూ నానిన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది వెనిజులా విపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకుదక్కింది. ఆ దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసమూ... నిరంకుశత్వం నుంచి ప్రజాస్వా మ్యానికి న్యాయమైన, శాంతియుతమైన పరివర్తన సాధించేందుకూ ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా దీన్ని అందిస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పురస్కారంపై బాగా ఆశలు పెట్టుకున్నారు గనుక సహజంగానే ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్ తప్పుబట్టింది. శాంతికన్నా రాజకీయాలకే కమిటీ ప్రాధాన్యమిచ్చిందని విమర్శించింది. కమిటీపై ఈ మాదిరి విమర్శలు గతంలో చాలా వచ్చాయి. మేధావులూ, సామాజిక అధ్యయనకారులూ ఆ పని చేసేవారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రాధాన్యతా అంశంగా భావించే వైపు ప్రపంచ ప్రజల చూపు మర ల్చటం కోసం నోబెల్ కమిటీ ప్రయత్నిస్తున్నదని విమర్శించేవారు. ఇప్పటికే ట్రంప్ వెనిజులాను అష్టదిగ్బంధం చేశారు. గత నెల మొదట్లో వెనిజులా స్పీడ్ బోట్లు రెండింటిపై అమెరికా సైన్యం విరుచుకు పడటంతో 17 మంది మరణించారు. ఇంతవరకూ అవి మాదక ద్రవ్యాలున్న బోట్లని చెప్పే ఆధారాలేమీ అమెరికా ప్రకటించలేదు. ఇది కేవలం మొదటి దశ అని, రెండో దశ వెనిజులా గడ్డపై ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అది సైనిక జోక్యం కావొచ్చన్న అంచనాలున్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వీటన్నిటిపైనా మచాడో స్పందనేమిటో తెలియదు. నిజానికి ఈ ఏడాది సూడాన్లో అత్యవసర సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఈ రేసులో ఉంటా యని పలువురు అనుకున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించటమో, కాల్పుల విరమణ సాధించటమో పురస్కారానికి అర్హత సాధించిపెడుతుందని ట్రంప్ అనుకున్నందుకు ఆయన్ను నిందించి ప్రయోజనం లేదు. అందుకు నోబెల్ కమిటీ బాధ్యత కూడా ఉంది. గతంలో కమిటీ ఇచ్చిన కొన్ని పురస్కారాలు గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ పురస్కారం ప్రకటించే నాటికి ఆయన అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైంది. ‘విశ్వ మానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ పురస్కారం ధ్రువీకరిస్తున్నద’ని ఒబామా ఘనంగా చెప్పుకొన్నారు. కానీ ఆ బహుమతి తనకెందుకిచ్చారో ఇప్పటికీ తెలియటం లేదని 2016లో ఆయన నిజాయతీగా ఒప్పుకొన్నారు. బుష్ మొదలెట్టిన యుద్ధాలను ఆయన మరింత ముందుకు తీసుకుపోయారు. ఒబామా ఏలుబడిలో లిబియా, సిరియా, సోమాలియా, అఫ్గాన్లలో అమెరికా సైన్యం దాడుల్లో వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో నోబెల్ ఎంపిక కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన గీర్లెండ్స్టెడ్ అది ఘోర తప్పిదమని 2015లో అంగీకరించారు. వాస్తవానికి 1973లో నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. 1971లో బొలీవియా, 1973లో చిలీ దేశాల్లో సైనిక తిరుగు బాట్లకు పథక రచన చేయటం, బంగ్లాదేశ్లో పాక్ సైన్యం సాగించిన నరమేధానికిఅండదండలీయటం, అనేక చోట్ల నియంతృత్వ ప్రభుత్వాలకు చేయూతనందించటం వగైరాల్లో ఆయన పాత్ర అత్యంత దారుణమైనది. నిరాయుధీకరణకూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికీ చిత్తశుద్ధితో పనిచేసేవారికి మొదట్లో ఆ బహుమతి ఇచ్చేవారు. అటుతర్వాత ఇతరేతర ప్రయోజనాలూ, ఉద్దేశాలూ వచ్చిచేరాయి. వర్తమానంలో ఆయుధాలు పోగేసుకోవటం, బెదిరించటం, క్షిపణులూ, బాంబులతో విధ్వంసం సృష్టించటం ఘనకార్యాలుగా చలామణీ అవుతున్నాయి.అలాంటి అధినేతలు దృఢమైన నాయకులుగా నీరాజనాలందుకుంటున్నారు. ఆ దృక్ప థాన్ని మార్చి శాంతి అంటే యుద్ధం లేకపోవటం మాత్రమే కాదనీ, సమాజంలో సమానత్వ సాధనకు కృషి చేయటం, ప్రపంచ శాంతికి దోహదపడటం అని అందరూ గుర్తించేందుకు నోబెల్ కమిటీ తన వంతు ప్రయత్నించిన దాఖలా లేదు. మరి ఈ పురస్కారాల పరమార్థం ఏమిటో ఆ కమిటీయే ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
అంతా ట్రంప్ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్ శాంతి’ విజేత
నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్హౌస్ నుంచి విమర్శల వాన కురిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కాకుండా వెనెజులా ప్రతిపక్ష నేత, ఆ దేశంలో ప్రజాస్వఘ్యానికి పాటుబడ్డ మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం.నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్హౌస్. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. వెనెజులా శాంతి స్థాపనలో ట్రంప్ కృషి వెలకట్టలేనిదని నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మరియా ప్రశంసించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. ‘ అంతా మీ చలవే.. ట్రంప్ను గుర్తుపెట్టుకుంటాం’ అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. 2025 నోబెల్ శాంతి పురస్కారం విజేత మరియా కొరీనా మచాడో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ముఖ్యంగా వెనిజులా ప్రజాస్వామ్య పోరాటానికి ఆయన మద్దతును కొనియాడారు.. ట్రంప్ను “వెనిజులా స్వేచ్ఛకు అత్యంత గొప్ప అవకాశంగా” ఆమె అభివర్ణించారు. ట్రంప్ పాలనలో మడురో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడిందన్నారు.President Trump,Your unwavering support for Venezuela’s fight for democracy is deeply valued. With extraordinary courage, the Venezuelan people have consistently defied fear and brutal repression, standing united to reject a criminal regime desperate to cling to power and… https://t.co/7EVCvHiQ2v— María Corina Machado (@MariaCorinaYA) January 11, 2025 ఇక ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ నా నోబెల్ నాకు కావాలి’ అంటూ ట్రంప్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంనోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!
వాషింగ్టన్: నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు.వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది .ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ అవార్డుల ప్రధానంతో నిరూపించింది’ అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ, అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేసుకోవడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తుంటారు. ఆయన గొప్ప మానవతావాది. అలాంటి వారు తమ సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించగలరు’ అని పేర్కొన్నారు. -
నోబెల్ బహుమతి అంటే పేరు మాత్రమే కాదు.. కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా!
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరనీ మచాడోను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కల కోసం పోరాడినందుకు గానూ నార్వే నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి అందిస్తున్నట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన నోబెల్ శాంతి పురస్కారం పొందిన గ్రహితలకు అందే ప్రొత్సహకాలపై చర్చ మొదలు కాగా.. వాటి వివరాలు నోబెల్ పీస్ ప్రైజ్ వెబ్సైట్లో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎవరైతే నోబెల్ శాంతి బహుమతి పొందారో వారికి ప్రైజ్ మనీ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (SEK) అందుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.10 కోట్లు పైచిలుకు మొత్తాన్ని దక్కించుకోవచ్చు. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి అవార్డుల ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్రాలు ఆరురంగాల వారికి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.తన మరణానికి ఒక సంవత్సరం ముందు, 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని, SEK 31 మిలియన్లకు పైగా (నేడు సుమారు SEK 2.2 బిలియన్లు) సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో పేర్కొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా పైన పేర్కొన్న ఆరు రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. నోబెల్ బహుమతి పొందిన వారికి భారీ మొత్తంలోప్రైజ్ మనీ దక్కనుంది.పతకం రూపకల్పన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తావ్ విజిలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో రూపొందించారు. ఈ పతకం మొదట 1902లో అవార్డు వేడుకలో ఉపయోగించారు. ఆరంభంలో.. 23-క్యారెట్ బంగారంతో తయారు చేశారు. బరువు 192 గ్రాములు 1980 తర్వాత.. 18 క్యారెట్ బంగారంగా మార్చారు. బరువు కొద్దిగా పెరిగి 196 గ్రాములు అయ్యింది.వ్యాసం: 6.6 సెంటీమీటర్లు ఇది స్థిరంగా ఉంది.పతకం రూపం,చిహ్నాలు:నోబెల్ ప్రైజ్ ముందు భాగం ఆల్ఫ్రెడ్ నోబెల్ పోర్ట్రెయిట్ఆయన పేరు, జనన తేదీ, మరణ సంవత్సరంవెనుక భాగం:ముగ్గురు నగ్న పురుషులు కౌగిలించుకున్న దృశ్యంఇది అంతర్జాతీయ సోదరభావానికి చిహ్నంలాటిన్ శాసనం: Pro pace et fraternitate gentium ‘ప్రజల మధ్య శాంతి, సోదరభావం కోసం’అంచు:5 మిల్లీమీటర్ల మందపాటి అంచు చుట్టూసంవత్సరం, అవార్డు గ్రహీత పేరు చెక్కబడి ఉంటుందిఈ పతకం రూపకల్పన, దాని చిహ్నాలు, దాని వెనుక ఉన్న భావన నోబెల్ శాంతి బహుమతికి ఉన్న ఆధ్యాత్మికత, గౌరవం, ప్రపంచ శాంతికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. -
బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్కి దక్కని నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారీ షాక్ తగిలింది. ట్రంప్కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ క్రమంలో 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్ కావడం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటుంటే, మరోవైపు కొన్ని వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను పరశీలిస్తే..👉ఇదీ చదవండి : మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంయాసిర్ అరాఫత్ (1994): ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ ఆయనపై తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉండటం వల్ల విమర్శలు ఎదురయ్యాయి.బరాక్ ఒబామా (2009): అధ్యక్ష పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే శాంతి ప్రయత్నాలకు బహుమతి రావడం అనేక ప్రశ్నలు రేకెత్తించింది. ట్రంప్ సైతం తాజాగా ఒబామా ఏం చేశారని అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలలకే నోబెల్ ఇచ్చారని, పైగా ఆయన అమెరికాను నాశనం చేశారని మండిపడ్డారు కూడా.ఆంగ్ సాన్ సూకీ (1991): మయన్మార్ ప్రజాస్వామ్య పోరాటానికి గుర్తింపుగా బహుమతి పొందారు. కానీ 2017లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన హింసను నిరసించకపోవడం వల్ల ఆమెపై విమర్శలు వచ్చాయి.హెన్రీ కిస్సింజర్ (1973): వియత్నాం యుద్ధం ముగింపుకు కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ యుద్ధంలో అమెరికా పాత్రపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.అబి అహ్మద్ (2019): ఈథియోపియాలో శాంతి ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ తరువాత దేశంలో అంతర్గత హింస పెరగడం వల్ల ఆయనపై విమర్శలు వచ్చాయి.వంగారి మాథై (2004): పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆమె, HIV బాధితులపై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదంలోకి వచ్చారు.గాంధీకి నోబెల్ ఎందుకు రాలేదంటే.. మహాత్మా గాంధీ.. శాంతి, అహింసకు ప్రతిరూపం. ఆయన నోబెల్ శాంతి బహుమతికి పలు మార్లు నామినేట్ అయ్యారు. 1948లో ఆయన హత్యకు గురైన టైంలో నోబెల్ కమిటీ.. ఈ గౌరవానికి అర్హులే లేరు అంటూ ఓ ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదమైంది. రాజకీయ కారణాలు, బ్రిటిష్ ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితులు ,ఇవన్నీ బహుమతి రాకపోవడానికి కారణాలుగా భావించబడ్డాయి. అయితే.. నోబెల్ కమిటీ 2006లో “గాంధీకి బహుమతి ఇవ్వకపోవడం మా పెద్ద తప్పు” అని అంగీకరించింది. ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉంటే గనుక.. పై జాబితాలో చేరి ఉండేదే. కానీ, ప్చ్.. ఆయన కల నెరవేరలేదు. -
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు, టైమ్ మ్యాగజైన్ -'2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో ఆమె చోటు సంపాదింకున్నారు కూడా. 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటి చేసిన మరియా.. 2014లో దేశంలో ఆందోళనలకు న్యాయకత్వం వహించారు .వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటి స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది.రాజకీయ పాత్ర..Vente Venezuela అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. Súmate అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హత పొందిన తర్వాత, ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు.ఎన్నికల మోసాలను బయటపెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.విద్యా నేపథ్యం:ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ఫైనాన్స్ స్పెషలైజేషన్యేలె యూనివర్శిటీ వరల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్అంతర్జాతీయ గుర్తింపుబీబీసీ-100 మంది అత్యంత ప్రభావంతుల జాబితాలో చోటు(2018)చార్లెస్ టి. మానాట్ ప్రైజ్(2014)లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్(2019)ఇదీ చదవండి: బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్కి దక్కని నోబెల్ శాంతి బహుమతి


