
నెల్లూరులోని నగరదారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. రెండోరోజు సోమవారం రొట్టెల పండగకు భక్తులు పోటెత్తారు

బారాషహీదులను ప్రశాంతంగా దర్శించుకున్నారు. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వచ్చే భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు రెండో రోజు భారీగా హాజరయ్యారు.

మరో మూడురోజుల పాటు ఈ పండుగ జరగనున్నది.

స్వర్ణాల చెరువు సమీపంలో రొట్టెల బోర్డులు వెలిశాయి. ప్రధానంగా విద్యా, ఆరోగ్య, సౌభాగ్య, ఉద్యోగ, వివాహ, సంతాన రొట్టెల బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఆరోగ్యం, ఉద్యోగం, వివాహ రొట్టెలకు అధిక ప్రాధాన్యమిచ్చారు.


















