
గుజరాత్ గుబులు
రుపానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించగలదా? సంవత్సర కాలంలో రుపానీ మోదీ వలె బలమైన నాయకుడుగా ఎదుగుతారా? నితిన్కు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలంటూ హార్థిక్ పటేల్ సవాలు విసిరారు.
త్రికాలమ్
రుపానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించగలదా? సంవత్సర కాలంలో రుపానీ మోదీ వలె బలమైన నాయకుడుగా ఎదుగుతారా? నితిన్కు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలంటూ హార్థిక్ పటేల్ సవాలు విసిరారు. గుజరాత్ జనాభాలో 15 శాతం ఉన్న పటేళ్ళు బీజేపీని క్షమించి తిరిగి ఆ పార్టీకి సుముఖులు కావడంపైనే 2017 ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కొంతకాలంగా ఓబీసీ ఏక్తా మంచ్ వేదికపైన వెనుకబడిన కులాల వారు సంఘటితం అవుతున్నారు. మోదీ వంటి బలమైన నాయకుడు లేడు. పార్టీ నేతల మధ్య కలహాలు ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో సహజంగా ఉండే విముఖత ఉన్నది. రుపానీ ఆరెస్సెస్ నేపథ్యం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి. దళితులపై దాడి ని ఆయన శాంతిభద్రతల సమస్యగా అభివర్ణించారు.
ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై ఏడు మాసాలు దాటిన తర్వాత నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అడుగుపెడుతున్నారు. దేశంలోని ముఖ్యమైన నగరాలలో హైదరాబాద్ ఒకటి. సాధారణంగా ఏ ప్రధానికీ హైదరాబాద్ సందర్శనకు ఇంత వ్యవధి పట్టదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఢిల్లీ నుంచి అస్సాం వరకూ అనేక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు రావడం, ఆయన విదేశీ పర్యటనలతో నిర్విరామంగా ఉండటంతో కొత్త రాష్ట్రాన్ని పలకరించడానికి ఇంతకాలం పట్టింది. మోదీ పర్యటన తెలంగాణ ప్రగతి యాత్రలో మైలురాయి. ఆయన గజ్వేల్లో మిషన్ భగీరథ పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు అక్కడి నుంచే ఆదిలాబాద్లోని జైపూర్లో 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రిమోట్ ద్వారా జాతికి అంకితం చేస్తారు.
నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింగరేణి థర్మల్ కేంద్రంలో మొదటి దశకు శంకుస్థాపన చేస్తారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రామగుండంలో నిర్మించే ఈ కేంద్రం 2020లో ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రంలో ఎన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తయినా విద్యుచ్ఛక్తి కొరత ఉండదు. ఈ సంద ర్భంగా తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొన్నది. అమెరికా అధ్యక్షుడి తరహాలో శనివారంనాడు ఢిల్లీలో టౌన్హాల్ సమావేశంలో ప్రసంగించి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నరేంద్రమోదీ ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన రాజనీతిజ్ఞుడిలాగా కనిపిస్తున్నారు. అంత మాత్రాన అయన పని నల్లేరు మీద బండిలాగా ఉందని అనుకోవడం పొరబాటు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే ఎన్నికల గురించీ, ఆ తర్వాత గుజరాత్ ఎన్నికల గురించీ ఆయన నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. మోదీ రాజకీయ భవిష్యత్తు యావత్తూ గుజరాత్ ఎన్నికల ఫలితాలపైన ఆధారపడి ఉంటుం దంటే అతిశయోక్తి కాదు. అందుకే గుజరాత్లో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు అగ్ర తర ప్రాధాన్యం. ఆచితూచి నిర్ణయం తీసుకోవడం.
గుజరాత్ గోదా
తమది భిన్నమైన పార్టీ అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ఎంపిక ఫక్తు కాంగ్రెస్ పంథాలోనే జరిగాయి. పార్టీ అధ్యక్షుడు అమిత్ షానూ, ఇద్దరు పరిశీలకులనూ (నితిన్ గడ్కరీ, సరోజ్ పాండే) మోదీ అహమ్మ దాబాద్ పంపించారు. శాసనసభ్యులతో రెండు రోజులు మాట్లాడి, రాజీనామా చేసిన ముఖ్యమంత్రి అనందీబెన్తో వాదులాడి విజయ్ రుపానీని ముఖ్య మంత్రిగా నిర్ణయించారు. అనందీ మద్దతు ఇచ్చిన నితిన్పటేల్ను ఉపముఖ్య మంత్రిగా ప్రకటించారు. శాసనసభ్యులకు తమ నాయకుడిని బ్యాలట్ ద్వారా ఎన్నుకునే స్వేచ్ఛ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వనట్టే బీజేపీ కూడా ఇవ్వలేదు.
ప్రభుత్వాలు కూల్చడంలో కూడా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించినట్టే బీజేపీ నాయకులు సైతం కత్తులు దూశారు. 1995లో కాంగ్రెస్ను మట్టికరిపించి మొదటిసారి బీజేపీని అధికారంలోకి తెచ్చిన కేశూభాయ్పటేల్ను ఆరు మాసాలు తిరగకుండానే గద్దె దింపడంలో శంకర్సింహ్ వాఘేలా పాత్రధారి అయితే సూత్రధారి నేటి ప్రధాని, నాటి గుజరాత్ బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ. కేశూభాయ్ స్థానంలో ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చొబెట్టిన సురేశ్ మెహతా ఏడాది కూడా పదవిలో కొనసాగలేకపోయారు. కేశూభాయ్కి అప కారం చేసిన వాఘేలా రెండేళ్ళలోనే పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. మోదీ గుజ రాత్లో ఉండటం ముఖ్యమంత్రికి క్షేమదాయకం కాదని పార్టీ అధిష్ఠానం ఆయ నను ఢిల్లీకి బదిలీ చేసింది. ఢిల్లీలో ఉన్నప్పటికీ మోదీ మనసంతా గుజరాత్పైనే. సురేశ్ మెహతా రాజీనామా తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అనివార్యమైనాయి.
1998లో జరిగిన ఎన్నికలలో కేశూభాయ్ పటేల్ విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. లోగడ తన పదవీచ్యుతికి కారకులైన సంఘపరి వారంపైన కేశూభాయ్ ప్రతీకార ధోరణి ప్రదర్శించారు. దాంతో ఆరెస్సెస్ మోదీని భుజాన ఎక్కించుకున్నది. రెండేళ్ళు గడిచే సరికి కేశూభాయ్కి శాసన సభ్యులపైనా, ప్రభుత్వంపైనా పట్టు తప్పింది. మాధవ్పురా మర్కెంటైల్ కోఆప రేటివ్ బ్యాంక్ కుంభకోణంతోనూ, సబర్కాంతా లోక్సభ స్థానానికీ, సబర్మతీ శాసనసభ స్థానానికీ జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ ఓటమితోనూ కేశూభాయ్ పటేల్ నాయకత్వంపైన బీజేపీ అధినేతలకు విశ్వాసం సన్నగిల్లింది. మోదీ 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు.
అంతవరకూ ఆయనకు చట్టసభలలో సభ్యత్వం లేదు. మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. పట్టుదల, వ్యూహరచనా కౌశలం, చాణక్యం, యుద్ధతంత్రం మాత్రం తెలుసు. రాజ్కోట్ శాసనసభ్యుడు వజాభాయ్వాలా సభ్యత్వం త్యాగం చేయడం వల్ల జరిగిన ఉప ఎన్నికలో మోదీ గెలుపొందారు. 1998లో వజాభాయ్వాలాకు వచ్చిన మెజారిటీ కంటే మోదీకి తక్కువే వచ్చింది. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోయింది. అదే సమయంలో గోధ్రా ఘటన సంభవించింది. అనంతరం అల్లర్లు. ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పనక్కరలేదు. హిందూ, ముస్లిం విభజన ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ పరిస్థితిని మోదీ అనితర సాధ్య మైన రీతిలో వినియోగించుకొని 12 సంవత్సరాలు తిరుగులేకుండా గుజరాత్ను పరిపాలించారు. ప్రగతి సాధించారు. ఆర్థికాభివృద్ధి రేటు రికార్డు స్థాయిలో గుజరాత్ నమోదు చేసింది. అదే గుజరాత్ నమూనా అభివృద్ధిగా సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రచార లో ప్రధానాస్త్రంగా పని చేసింది.
ఆరోపణల పరంపర
కేశూభాయ్ హయాంలో ఆయన అల్లుడు మయూర్ పెత్తనం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తితే ఆనందీ హయాంలో కూతురు అనార్, కొడుకు సంజ య్ల హవా నడిచిందనే మాట సర్వత్రా వినిపించింది. అవినీతి పెచ్చరిల్లింది. అధికార పక్షానికి ఉండే అవలక్షణాలన్నీ కాంగ్రెస్కు ఉన్నట్టే బీజేపీకీ సంక్ర మించాయి. కేశూభాయ్కి మోదీ వల్ల కష్టాలు ఎదురైతే అనందీకి అమిత్షా వల్ల సమస్యలు దాపురించాయి. తనను అప్రతిష్ఠపాలు చేయడానికే పతీదార్ల ఉద్య మాన్ని కొందరు ప్రోత్సహించారంటూ ఆనందీ ఆక్రోశం వెలిబుచ్చినప్పుడు ‘దానితో నాకు సంబంధం లేదు. కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చాను’ అంటూ అమిత్షా ఘాటుగా సమాధానం చెప్పినట్టు భోగట్టా.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా తట్టుకోవచ్చును కానీ మరి 16 మాసాలలో జరగబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలైతే దాని ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలపైన పడితీరుతుంది. ఎన్డీఏ కూటమి కూలిపోయి కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మోదీకీ, షాకీ అనేక సమస్యలు. ఇష్రాన్ జహాన్ ఎన్కౌంటర్ కేసుతో సహా మరెన్నో కేసులను తిరగదోడే ప్రమాదం ఉంది. మోదీ బదనాం అయితే బీజేపీకి మళ్ళీ అంతటి బలమైన, జనాకర్షణ కలిగిన, సమర్థుడైన నాయకుడు దొరకడు.
ఎదురుగాలి
అందుకే గుజరాత్లో గెలుపు మోదీకీ, బీజేపీకీ అత్యవసరం. 2014లో ఉన్నటువంటి సానుకూల వాతావరణం ఇప్పుడు లేదు. ఆనందీ పాలనలో అపారమైన నష్టం సంభవించింది. బీజేపీకి గట్టి మద్దతుదారులైన పతీ దార్లు(పటేళ్ళు)బద్ధ శత్రువులుగా మారిపోయారు. హార్థిక్పటేల్ అనే 22 ఏళ్ళ యువకుడి నాయకత్వంలో రిజర్వేషన్లు కోరుతూ జరిగిన ఆందోళనను అరికట్టడంలో ఆనందీ విఫలమైనారు. రాజీ లేని ధోరణిలో కఠినంగా వ్యవ హరించి హార్థిక్ను నెలల తరబడి జైలులో నిర్బంధించారు. గోరక్షణ పేరుతో కొందరు హిందూత్వవాదులు ఉనాలో దళితులపై పాశవికంగా దాడి చేయడంతో ఆ వర్గం బీజేపీకి పూర్తిగా దూరమైపోయింది. దళితులపై దాడికి ముందే మే 16న ఆనందీని ఢిల్లీకి పిలిపించుకొని పదవి నుంచి తప్పుకోవలసిందిగా మోదీ చెప్పారు. కొన్ని మాసాలలో 75వ ఏట అడుగుపెట్టే సమయంలో రాజీనామా సమర్పిస్తానని ఆమె అన్నారు. కానీ దళితులపైన దాడి జరిగిన తర్వాత వెంటనే చర్య తీసుకోవలసి వచ్చింది. దళితులు గుజరాత్ జనాభాలో తొమ్మిది శాతం మంది మాత్రమే కావచ్చు. వారు కాంగ్రెస్ ఓటర్లే కావచ్చు. కానీ దళితులపైన దాడి చేసినప్పుడు ప్రధానిగా తాను ఉపేక్షిస్తే దళిత జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో దాని ప్రభావం ఉంటుంది. అందుకని వెంటనే రాజీనామా చేయవలసిందిగా ఆనందీకి కబురు పెట్టారు.
అరవై ఏళ్ళ విజయ్ రుపానీ జైన్బనియా. వ్యాపారం ప్రధానమైన కులం. మృదుభాషి. కేశూభాయ్తోనూ, నరేంద్రభాయ్తోనూ, అమిత్షాతోనూ, ఆనం దీతోనూ సత్సంబంధాలు నెరపిన వివాదరహితుడు. నితిన్ పటేల్ చివరి నిమిషం వరకూ పదవి తనదేనన్న ధీమాతో ఉన్నారు. మిత్రులు చెప్పిన అభినం దనలను స్వీకరించారు. మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. చివరికి అమిత్షా రుపానీవైపు మొగ్గడం గమనించి నిరసనగా సమావేశం నుంచి నిష్ర్క మించాలని ప్రయత్నించారు. షా ఆపుచేసి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పిం చారు. పతీదార్ల ఉద్యమానికి నితీన్ సహకారం ఉన్నదని మోదీ, షాల అను మానం. నితిన్ ముందే మిఠాయి పంచితే రుపానీ ఇందుకు భిన్నం. తనకు ముఖ్యమంత్రి పదవి పట్ల మోజు లేదనీ, తనను ఎంపిక చేయకపోవచ్చుననీ మీడియాకు చెప్పారు. మోదీకీ, షాకీ ఆమోదయోగ్యుడు కావడం, పటేల్ సామాజికవర్గంతో చర్చలు జరిపి వారి హృదయాలను గెలుచుకోవాలన్న సకారాత్మక వైఖరి కలిగి ఉండటం రుపానీకి కలసివచ్చిన అంశాలు.
ఆనందీ బదులు రుపానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించగలదా? సంవత్సర కాలంలో రుపానీ మోదీ వలె బలమైన నాయకుడుగా ఎదుగుతారా? నితిన్కు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలంటూ హార్థిక్ పటేల్ సవాలు విసిరారు. గుజరాత్ జనాభాలో 15 శాతం ఉన్న పటేళ్ళు బీజేపీని క్షమించి తిరిగి ఆ పార్టీకి సుముఖులు కావడంపైనే 2017 ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కొంతకాలంగా ఓబీసీ ఏక్తా మంచ్ వేదికపైన వెనుకబడిన కులాల వారు సంఘటితం అవుతున్నారు. మోదీ వంటి బలమైన నాయకుడు లేడు. పార్టీ నేతల మధ్య కలహాలు ఉన్నాయి.
పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో సహజంగా ఉండే విముఖత ఉన్నది. రుపానీ ఆరెస్సెస్ నేపథ్యం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి. దళితులపై దాడిని ఆయన శాంతిభద్రతల సమస్యగా అభివర్ణించారు. ఆయన సౌరాష్ట్రకు చెందిన నాయ కుడు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. ఉనా సౌరాష్ట్రలోనే ఉన్నది. రుపానీ ఇంత వరకూ దళితులపైన దాడి జరిగిన గ్రామాన్ని సందర్శించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించలేదు. దళితులను సుముఖం చేసుకోవడానికి ఆరెస్సెస్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ రూపానీ వ్యవహార శైలి అందుకు భిన్నంగా కనపడుతోంది. మోదీకి ఉన్న చొరవ రుపానీకి లేదు. మోదీలాగా ఉదారంగా, సృజనాత్మకంగా వ్యవహరించలేరు. ఈ పరిమితులు ఆయన రాజకీయాలను శాసిస్తాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ గెలిచి వరుసగా నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అద్భుతమే.
(వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ )