బ్రిటన్ ప్రధాని ఆ కంపెనీలకు వెళ్లరట!
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన థెరిస్సా మే, తొలిసారి భారత పర్యటన భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన థెరిస్సా మే, తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. ఆమె ఈ పర్యటన ఇతర మాజీ బ్రిటన్ ప్రధానుల పర్యటనలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. బెంగళూరులోని ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలను ఆమె సందర్శించకపోవచ్చని సమాచారం. యూకే విధానాల రక్షణవాదిగా ఆమె ఈ కంపెనీలకు వెళ్లకపోవపచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే మంగళవారం బెంగళూరు పర్యటనలో భాగంగా ఆమె ఏరోస్పేస్, హైడ్రాలిక్ పంప్స్ తయారీదారు అయిన డైనమిక్స్ టెక్నాలజీస్ను మాత్రమే సందర్శిస్తారని తెలుస్తోంది. యూకేలో స్థానిక ఉద్యోగాలు కల్పించడంలో ఈ కంపెనీ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోనే హైడ్రాలిక్ పంప్స్ను సరఫరా చేస్తున్న అతి పెద్ద కంపెనీగా దీనికి పేరొంది. కానీ ఇన్ఫోసిస్, విప్రో మాదిరి బ్రాండ్ నేమ్ను ఈ కంపెనీ కలిగి లేదు.
గత రెండు దశాబ్దాలుగా బ్రిటన్ ప్రధానులుగా వ్యవహరించిన జాన్ మేజర్, టోని బ్లెయిర్, గోర్డన్ బ్రౌన్, డేవిడ్ కెమెరాలు భారత పర్యటనకు వచ్చినప్పుడు కచ్చితంగా బెంగళూరులోని విప్రో, ఇన్ఫోసిస్ క్యాంపస్లను సందర్శించేవారు. యంగ్ సాప్ట్వేర్లతో వారు భేటీ అయ్యేవారు. కానీ థెరిస్సా పర్యటన వారికి భిన్నంగా సాగనుంది. తన ప్రభుత్వహయాంలో యూకేలో వలసవాదులను తగ్గిస్తానని ఆమె వాగ్దానం చేశారు. ఈ నేపథ్యంలో యూకే వీసా నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నిర్ణయం భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారీ ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే వృద్ధి మందగించి సంక్షోభంలో ఉన్న భారత సాప్ట్వేర్ రంగానికి, ఇది మరింత ప్రతికూలత. యూకే నుంచి 108 బిలియన్ డాలర్ల సాప్ట్ వేర్ ఎగుమతుల రాబడులను ఆర్జిస్తున్న భారత్ సాప్ట్వేర్ రంగం ఈ నిర్ణయంతో రాబడులను కోల్పోనుంది. తాజా పర్యటనలో భాగంగా కూడా బెంగళూరు ప్రముఖ ఐటీ కంపెనీలు సందర్శించకపోవడం భారత సాప్ట్వేర్కు మరింత ప్రతికూలంగా మారనుందని తెలుస్తోంది.