‘ఓటుకు కోట్లు’లో ఉన్న ముగ్గురికీ అందలం | Telangana committee was dissatisfied with the party setting | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’లో ఉన్న ముగ్గురికీ అందలం

Oct 1 2015 4:06 AM | Updated on Jul 11 2019 7:38 PM

తెలంగాణ కమిటీ కూర్పుపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనిచేసిన వారికి గుర్తింపే దక్కలేదని, చురుగ్గా లేనివారికి పెద్దపీట వేశారని పలువురు నేతలు వాపోయారు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కమిటీ కూర్పుపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనిచేసిన వారికి గుర్తింపే దక్కలేదని, చురుగ్గా లేనివారికి పెద్దపీట వేశారని పలువురు నేతలు వాపోయారు. ‘కార్యకర్తల మనోభీష్టం మేరకే ఎంపిక’ అనే పేరుతో ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే చేయిం చారు. రేవంత్‌ను అధ్యక్షుడిగా చేయాలని సర్వేలో ఎక్కువమంది చెప్పారంటూ ప్రచారంలో పెట్టారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో కోట్లలో బేరం కుదుర్చుకుని, రూ.50 లక్షల ముడుపులిస్తూ రేవంత్ అడ్డంగా ఏసీబీకి దొరకడం తెలిసిందే. రేవంత్‌పాటు ఈ కేసుతో సంబంధమున్న సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్‌రెడ్డిలకు కూడా పార్టీ పదవులు కట్టపెట్టడంపై కేడర్‌లో విస్మయం వ్యక్తమవుతోంది.

పార్టీ కోసం శ్రమిస్తున్న వారిని కాదని ఇతరులకు పలు కమిటీల్లో పదవులిచ్చారని పలువురు నేతలు వాపోయారు. ఒక రాజ్యసభ సభ్యుడు సూచించిన వారికే ప్రాధాన్యమిచ్చారని, పార్టీలో చురుగ్గా లేని మండవ వెంకటేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హైదరాబాద్ నగర కమిటీ అధ్యక్షుడిగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కృష్ణయాదవ్ తదితరులకు పదవులు కట్టబెట్టారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లిని పొలిట్‌బ్యూరోకే పరిమితం చేయడం, ఇనుగా ల పెద్దిరెడ్డి వంటివారిని జాతీయ అధికార ప్రతినిధి చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement