సెక్షన్ 8పై పిల్ సరికాదు | Section 8 is not on the pill | Sakshi
Sakshi News home page

సెక్షన్ 8పై పిల్ సరికాదు

Jul 15 2015 12:38 AM | Updated on Aug 18 2018 4:16 PM

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టాలని

రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు: హైకోర్టు

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టాలని పేర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ని కొట్టేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ చట్ట నిబంధన చట్టబద్ధతను పిల్ రూపంలో సవాలు చేయడానికి వీల్లేదని, అందువల్ల ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని స్పష్టం చేసింది. సెక్షన్ 8పై పిల్ కాకుండా, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని తేల్చి చెప్పింది.

దీంతో పిటిషనర్లు తమ పిల్‌ను ఉపసంహరించుకుని, రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 8ని కొట్టివేయాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన రైతు సాంబరాజు పద్మనాభరావు, శ్రీరామగిరి స్పిన్సింగ్ మిల్స్ డెరైక్టర్ (ఫైనాన్స్) అల్లం భిక్షం, న్యాయవాదులు మరిశెట్టి తాతాజీ, కె.మోహన్‌రాజులు సంయుక్తంగా హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement