భారత్ ఆయుధాల వల్లే ప్రతిచర్యలు | Pakistan Prime Minister Sharif comment | Sakshi
Sakshi News home page

భారత్ ఆయుధాల వల్లే ప్రతిచర్యలు

Oct 24 2015 1:28 AM | Updated on Mar 23 2019 8:29 PM

భారత్ ఆయుధాల వల్లే ప్రతిచర్యలు - Sakshi

భారత్ ఆయుధాల వల్లే ప్రతిచర్యలు

భారత్ చర్చలకు తిరస్కరిస్తూ కొన్ని శక్తుల సాయంతో ఆయుధాలను పెంచుకోవటం, ప్రమాదకర సైనిక విధానాలను అవలంబించటం చేస్తోందని..

పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్య
 
 వాషింగ్టన్: భారత్ చర్చలకు తిరస్కరిస్తూ కొన్ని శక్తుల సాయంతో ఆయుధాలను పెంచుకోవటం, ప్రమాదకర సైనిక విధానాలను అవలంబించటం చేస్తోందని.. దీనివల్ల పాకిస్తాన్ సమర్థవంతమైన హెచ్చరికను కొనసాగించటానికి ప్రతిచర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో.. అమెరికా పార్లమెంటుకు చెందిన మేధో సంస్థ యూఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో మాట్లాడారు. తాను రెండున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చాక భారత్ తో సంబంధాన్ని మెరుగుపరచటం కోసం నిజాయితీగా ప్రయత్నాలు చేశానని.. మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించానని చెప్పారు. దీనివల్ల వచ్చిన కదలిక.. గత ఆగస్టులో ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలను కుంటి సాకులతో రద్దుచేయటంతో ముగిసిపోయిందన్నారు.

 ‘ఉగ్ర’గ్రూపులన్నింటిపైనా చర్య తీసుకోవాలి: అమెరికా
 వాషింగ్టన్: ఉగ్రవాద గ్రూపులన్నింటిపైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇందులో తేడాలుండరాదని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. భారత్-పాక్ శాంతి చర్చల ప్రక్రియలో ఇరు దేశాలు ఉమ్మడిగా అడిగితే తప్ప తనకు తానుగా ఎలాంటి పాత్ర పోషించేది లేదని తేల్చిచెప్పింది. అన్ని మిలిటెంటు గ్రూపులపైనా నిబద్ధతతో చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి తాము స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ ఎరిక్ షుల్జ్ మీడియాకు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో గురువారం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 90నిమిషాల పాటు చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఐరాస తీర్మానాలను అనుసరించి లష్కరే తోయిబా, దాని అనుబంధ ఉగ్రవాద గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటానని షరీఫ్ ఒబామాకు తెలిపినట్లు పేర్కొన్నారు.

 పాక్‌తో అణు ఒప్పందం లేదు: అమెరికా
 పాకిస్తాన్‌తో భారత్ తరహా అణు ఒప్పందం ఏదీ లేదని అమెరికా కొట్టి పారేసింది. ఈ విషయమై అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు తప్పని సీనియర్ అమెరికా అధికారి స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల నేతలు పాక్ అణు భద్రతపై చర్చలు సాగించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి అణ్వస్త్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పాక్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికా భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి తమ సహకారం ఉంటుందని.. దీనిపై పాక్‌తో భవిష్యత్తులోనూ చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కశ్మీర్ వివాద పరిష్కారం కోసం జోక్యం చేసుకోడానికి అమెరికానే సరైందని నవాజ్ షరీఫ్ శుక్రవారం అమెరికా సెనేటర్లతో అన్నారు. భారత్‌తో శాంతికి సంబంధించి తాను ప్రతిపాదించిన 4 ప్రతిపాదనలపై ఆయన పలువురు సెనేటర్లతో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement