కన్నేశాడు.. కాటేశాడు.. | Man raped minor girl | Sakshi
Sakshi News home page

కన్నేశాడు.. కాటేశాడు..

Oct 20 2015 12:06 AM | Updated on Jul 23 2018 9:13 PM

కన్నేశాడు.. కాటేశాడు.. - Sakshi

కన్నేశాడు.. కాటేశాడు..

అప్పటికే పెళ్లైంది.. భార్య ఉంది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మరో మహిళతో సహజీవనం చేస్తూ ఓ మైనర్ బాలికపై కన్నేశాడో ప్రబుద్ధుడు.

కుత్బుల్లాపూర్: అప్పటికే పెళ్లైంది.. భార్య ఉంది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మరో మహిళతో సహజీవనం చేస్తూ ఓ మైనర్ బాలికపై కన్నేశాడో ప్రబుద్ధుడు. పథకం ప్రకారం ఇంట్లోకి పిలిపించి బీరు తాగించి మరీ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కు చెందిన ఓ బాలిక (14) బతుకుదెరువు కోసం కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో పని చేస్తూ తల్లితో కలిసి ఉంటుంది. మెదక్‌జిల్లా చేగుంట మండలం రాంపూర్‌కు చెందిన ఎల్లం (45 ) కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేస్త్రీ పని చేసే ఎల్లంకు ఒంటరిగా ఉంటున్న మణెమ్మతో వివాహేతర సంబంధం ఉంది.

ఈ నేపధ్యంలో మెదక్ జిల్లాకు చెందిన బాలిక ఎల్లం ఉంటున్న కాలనీలోనే ఓ ఇంట్లో పని చేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఆ బాలికపై కన్నేసిన ఎల్లం ఎట్టకేలకు లొంగ దీసుకోవాలని పథకం పన్నాడు. ఈ నెల 13వ తేది మంగళవారం మధ్యాహ్నం సమయంలో కొత్త బట్టలు తీసుకున్నా చూద్దువురా అంటూ బాలికకు మాయమాటలు చెప్పి మణెమ్మ ఇంటికి తీసుకు వచ్చింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఎల్లం ప్రధాన ద్వారానికి గొళ్లెం పెట్టి బాలికకు బలవంతంగా బీరు తాగించి మణెమ్మ సమక్షంలోనే లైంగిక దాడికి దిగాడు.

నాటి నుంచి బాలిక పరిస్థితి విషమంగా మారింది. జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పుకోలేకపోయింది. రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరం రావడంతో ఇంటి యజమానిరాలుతో పాటు బాలిక తల్లి గట్టిగా అడగడంతో బోరున విలపిస్తూ జరిగిన విషయం చెప్పింది. దీంతో సోమవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధితులు సీఐ డి.వి.రంగారెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టంతో పాటు బాలిక ను హింసించడంపై కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement