భార్య కోసం ఐదేళ్లు వెతికితే.. భర్తకు షాక్!

భార్య కోసం ఐదేళ్లు వెతికితే.. భర్తకు షాక్! - Sakshi


దాదాపు ఐదేళ్లపాటు భార్య కనిపించకుండా పోయిందని వెతుకుతున్న భర్తకు ఆమె కనిపించడంతో పాటు ఊహించని షాక్ ఎదురైంది. బీహార్ లోని ముజఫర్ నగర్ కు చెందిన హతిమ్ అన్సారీ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన అమాన అనే మహిళతో ఐదేళ్ల క్రితం పెద్దలు అంగరంగ వైభవంగా పెళ్లి చేయించారు. పెళ్లయిన కొద్దిరోజుల వరకు గ్రామంలోనే ఉన్న అన్సారీ.. ఉద్యోగం కోసం భార్యతో కలిసి ఫరీదాబాద్ కు మకాం మార్చాడు.



భర్త ఉద్యోగానికి వెళ్లిన తర్వాత వేరే వ్యక్తితో పరిచయం పెంచుకున్న అమాన.. కొన్నాళ్ల తర్వాత అతనితో వెళ్లిపోయింది. ఇది తెలియని అన్సారీ, తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. చివరకు అమాన చనిపోయిందని అందరూ అన్నా.. తాను మాత్రం నమ్మలేదు. అమాన తల్లిదండ్రులు కూడా అన్సారీనే ఆమెను చంపేసి శరీరాన్ని కనిపించకుండా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం జైలు శిక్షను సైతం అనుభవించాడు. అయినా, భార్య మీద ప్రేమ తగ్గకపోవడంతో ఆమె కోసం వెతుకులాటను ఆపలేదు.



కొద్దిరోజుల క్రితం అమాన ఫరుఖాబాద్ లో కనిపించిందని దూరపు బంధువులెవరో పోన్ చేసి చెప్పడంతో సంతోషం పట్టలేకపోయిన అన్సారీ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అమాన ఇంటిపై దాడిచేసి ఆమె వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోందని నిర్ధారించుకున్నారు. తన పేరు కూడా కాజల్ అని మార్చుకుందని చెప్పినట్లు అన్సారీకి తెలిపారు. అన్సారీతో జీవించడం ఇష్టం లేకపోవడం వల్లే బయటకు వచ్చేసినట్లు చెప్పినట్లు వివరించారు. దీంతో ప్రేమతో నిండిన అన్సారీ హృదయం ఒక్కసారిగా ముక్కలైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top