'తల్లి రీ- ఎంట్రీతో కూతురి లైఫ్స్టైల్ మారింది' | Indrani Mukerjea Re-entered Sheena Bora's Life With Cars, World Trips | Sakshi
Sakshi News home page

'తల్లి రీ- ఎంట్రీతో కూతురి లైఫ్స్టైల్ మారింది'

Aug 28 2015 10:46 AM | Updated on Sep 3 2017 8:18 AM

తల్లి ఇంద్రాణి చేతితో హత్యకు గురైనట్లుగా భావిస్తున్న షీనా బోరా (ఫైల్ ఫొటో)

తల్లి ఇంద్రాణి చేతితో హత్యకు గురైనట్లుగా భావిస్తున్న షీనా బోరా (ఫైల్ ఫొటో)

గువాహటీలో హాయిగా సాగుతున్న షీనా జీవితం తల్లి ఇంద్రాణి రీ- ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది..

అప్పటిదాకా ఆమె ప్రపంచం వేరు. ఆహ్లాదకరమైన గువహటిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఎగిరే పక్షిలా ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది షీనా బోరా. తన అందాన్ని పొగిడే స్నేహితురాళ్లకు తల్లి ఇంద్రాణి ఫొటోను చూపిస్తూ.. 'చూడండే.. మా అమ్మ ఎంత అందంగా ఉందో. నావీ ఆమె పోలికలే' అంటూ మురిసిపోయేదట! ఆమె చిన్నానాటి స్నేహితుడు, గువాహటికి చెందిన అర్నాబ్ సిక్దార్.. షీనా బోరాకు సంబంధించిన కొత్త విషయాలను మీడియాకు చెప్పారు.

'స్కూల్లో జరిగే ఆర్ట్స్, మ్యూజిక్ కాంపిటీషన్ అన్నింట్లోనూ షీనా పాల్గొనేంది. అవంటే ఆమెకు చాలా ఇంట్రెస్ట్. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడాఎక్కువే. తాత ఉపేంద్ర కుమార్, అమ్మమ్మ, అన్నయ్య మిఖైల్ అంటే షీనాకు ప్రాణం. వాళ్లు కూడా ఆమెను గారాబం చేసేవాళ్లు. బంగారమొకెత్తుగా చూసుకునేవాళ్లు. ఎప్పుడైనా తల్లిదండ్రుల ప్రస్తావన వస్తే.. 'అమ్మానాన్న విడిపోయారు. ప్రస్తుతం అమ్మ విదేశాల్లో ఉంది' అని మాతో చెప్పేంది..' అంటూ షీనా చిన్ననాటి సంగతులు చెప్పుకొచ్చాడు అర్నాబ్. అలా హాయిగా సాగుతున్న షీనా జీవితం తల్లి ఇంద్రాణి రీ- ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది..

'తొమ్మిది, పదో తరగతుల్లో షీనాలో ఊహించని మార్పు! కొత్త కొత్త లగ్జరీ కార్లలో తిరుగుతుండేది. ఆ వయసులోనే ప్రపంచ యాత్రలకు వెళ్లొచ్చేది. ఈ మార్పు మాకు వింతగా అనిపించేది. తర్వాతగానీ మాకు తెలిసిరాలేదు.. విదేశాల నుంచి షీనా తల్లి(ఇంద్రాణి) తిరిగొచ్చిందని. 2012లో గువాహటి వదిలి ముంబై వెళ్లిపోయిన తర్వాత షీనాను కలవలేదు. తాజాగా హత్యోదంతం వెలుగులోకి రావడంతో నా చిన్ననాటి స్నేహితురాలిని ఎప్పటికీ కలవలేనని తెలిసొచ్చింది' అని చెప్పాడు అర్నాబ్ సిక్దార్.

Advertisement
 
Advertisement
Advertisement