భారత్‌, పాకిస్తాన్‌ కలిసికట్టుగా.. | India and Pakistan joined the Shanghai Cooperation Organisation as full members | Sakshi
Sakshi News home page

భారత్‌, పాకిస్తాన్‌ కలిసికట్టుగా..

Jun 9 2017 3:27 PM | Updated on Sep 5 2017 1:12 PM

భారత్‌, పాకిస్తాన్‌ కలిసికట్టుగా..

భారత్‌, పాకిస్తాన్‌ కలిసికట్టుగా..

సరిహద్దులో నిత్యం పోట్లాడుకునే దాయాదులు.. కలిసికట్టుగా ఒకే ప్రతిజ్ఞ చేసిన సందర్భమిది.

అస్తానా: సరిహద్దులో నిత్యం పోట్లాడుకునే దాయాదులు.. కలిసికట్టుగా ఒకే ప్రతిజ్ఞ చేసిన సందర్భమిది. ప్రఖ్యాత షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లోకి పూర్తిస్థాయి సభ్యులుగా భారత్‌, పాకిస్తాన్‌లు ప్రమాణం చేశాయి. కజకిస్తాన్‌ రాజధాని అస్తానాలో ఎస్‌సీఓ వార్షిక సదస్సులో ఈ మేరకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పూర్తికాల సభ్యులుగా చేరిన సందర్భంగా భారత్‌, పాక్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్‌ షరీఫ్‌లను సంస్థలోని ఇతర సభ్యదేశాలు అభినందించాయి.

యూరప్‌-ఆసియా దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారం కోసం షాంఘై(1996లో)లో ఏర్పాటయిన కూటమిని షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లో చైనా, కజకిస్తాన్‌, కర్గీజ్‌స్తాన్‌, తజకిస్తాన్‌, రష్యాలు వ్యవస్థాపక సభ్యుదేశాలుగా ఉన్నాయి. మొదటి విస్తరణ(2001)లో ఉబ్జెకిస్తాన్‌ సభ్యత్వం పొందగా.. నేడు(9 జూన్‌, 2017) భారత్‌, పాకిస్థాన్‌లు పూర్తికాల సభ్యులయ్యాయి.

ఉగ్రవాదంపై పోరుకు మోదీ పిలుపు
12ఏళ్ల పరిశీలన అనంతరం భారత్‌కు ఎస్‌సీఓ సభ్యత్వం దక్కడం ఆనందరంగా ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ.. సభ్యదేశాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా పోరాడుదామని అన్నారు. మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, దానిని అంతం చేస్తేనేగానీ ప్రగతి సాధించలేమని పేర్కొన్నారు.

భారత్‌కు పాక్‌ అభినందనలు
‘ఎస్‌సీఓలో సభ్యత్వం పొందిన శుభసందర్భంలో భారత్‌కు నా శుభాకాంక్షలు..’ అంటూ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీప్‌ తన ఉపన్యాసాన్ని ప్రారంభించడం గమనార్హం. ‘మన భవిష్యత్‌ తరాలను యుద్ధం, సంఘర్షణలవైపు పోనియ్యకుండా శాంతిసమాధానాలతో జీవించేలా చేయడం మన కర్తవ్యం. ఇందుకు షాంఘై సహకార సంస్థ కృషిచేస్తుంది’అని షరీఫ్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement