మృతుల్లో 14 మంది భారతీయులు | Haj stampede: List of 14 Indians who died | Sakshi
Sakshi News home page

మృతుల్లో 14 మంది భారతీయులు

Sep 26 2015 3:23 AM | Updated on Sep 3 2017 9:58 AM

మృతుల్లో 14 మంది భారతీయులు

మృతుల్లో 14 మంది భారతీయులు

మక్కా దగ్గర్లో మినాలో గురువారం హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిలో 14 మంది భారతీయులు ఉన్నారు.

హజ్ తొక్కిసలాటలో మరో 13 మందికి గాయాలు
* 719కి చేరిన మృతుల సంఖ్య
మినా(సౌదీ అరేబియా): మక్కా దగ్గర్లో మినాలో గురువారం హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిలో 14 మంది భారతీయులు ఉన్నారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. చనిపోయిన భారతీయుల్లో ఇద్దరు హైదరాబాద్ వాసులు, ముగ్గురు తమిళనాడు వాసులు ఉన్నట్లు గుర్తించారు. మృతిచెందిన భారతీయుల సంఖ్య 14కు చేరినట్లు జెడ్డాలోని తమ కాన్సుల్ జనరల్ తెలిపారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్‌లో తెలిపారు.  

మృతుల ను గుర్తుపట్టేందుకు భారతీయ వలంటీర్లు పెద్ద సంఖ్యలో మక్కా చేరుకుని, అక్కడి అధికారులకు సాయం పడుతున్నారని వెల్లడించారు.  కాగా, ఈ దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 719కి చేరింది. వీరిలో తమ దేశానికి చెందిన 31 మంది ఉన్నారని ఇరాన్, తమ పౌరులు ఆరుగురు ఉన్నారని పాకిస్తాన్ తెలిపాయి. దుర్ఘటన నేపథ్యంలో భద్రత నిర్వహణను సమీక్షించాలని సౌదీ రాజు  అధికారులను ఆదేశించారు. ఈ విషాద సమయంలో ముస్లింలకు సంఘీభావం తెలుపుతున్నామని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.
 
మృతుల్లో మరో హైదరాబాదీ మహిళ
సాక్షి, హైదరాబాద్: ఈ తొక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన బీబీజాన్ మృతిచెందడం తెలిసిందే. ఈమెతో పాటు హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని ఘాజీమిల్లత్ కాలనీకి చెందిన సబా తస్లీబ్(52) అనే మహిళ కూడా మృతిచెందినట్లు ఆమె కుమారుడు నిస్సార్ మహ్మద్ శుక్రవారం తెలిపారు. ఆమె అంత్యక్రియలను మక్కాలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సబా తన భర్త మహ్మద్ గౌస్‌తో కలసి మక్కా వెళ్లారు. ఆమె మృతివార్త తెలియడంతో కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు. సబా కుటుంబాన్ని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement