భారీగా ఆహార ధాన్యాల దిగుబడి | Government sees record food grains output in 2016-17 | Sakshi
Sakshi News home page

భారీగా ఆహార ధాన్యాల దిగుబడి

Feb 16 2017 4:21 PM | Updated on Sep 5 2017 3:53 AM

ఆహార ధాన్యాలు రికార్డు స్థాయిలో దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదుకావడంతో ఆహార ధాన్యాలు రికార్డు స్థాయిలో దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి 271.98 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడి రానున్నాయి. ఇందులో వరి, గోధుమ, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు సైతం గత ఏడాది దిగుబడికంటే అధికంగానే చేతికి రానున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.

గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 251.57 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. 2013–14 ఏడాదిలో 265.04 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2016–17 ఏడాదికి గాను 108.86 మిలియన్‌టన్నుల వరి దిగుబడి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

గత ఏడాది జూలై నాటికి 104.41 మిలియన్‌ టన్నులు వరి ఉత్పత్తి కాగా, 2013–14 ఏడాదికి గాను రికార్డు స్థాయిలో 106.65 మిలియన్‌ టన్నుల వరి దిగుబడి నమోదైనట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇక గోధుమ విషయానికొస్తే ఈ ఏడాది 96.64 మిలియన్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తోంది. 2015–16 ఏడాదిలో 92.29 మిలియన్‌ టన్నుల దిగుబడి లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement