ఢిల్లీలో గోధుమల సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో గోధుమల సేకరణ ప్రక్రియను పునప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను ఆదేశించింది. 2021-22 సీజన్ నుంచి నిలిచిపోయిన ఈ ప్రక్రియను తక్షణమే తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 24 నుంచి సేకరణ కేంద్రాలు ప్రారంభం
తాజా అధికారిక సమాచారం ప్రకారం, 2026 ఏప్రిల్ 24 నుంచి ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. నరేలా, నజాఫ్గఢ్ మండిలో రైతుల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు తమ పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవసరం లేకుండా ఇంటికి సమీపంలోనే కనీస మద్దతు ధరకు విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.
21,000 మంది రైతులకు లబ్ధి
రాజధాని ప్రాంతంలో సుమారు 29,000 హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ సాగు జరుగుతోంది. ఏడాదికి దాదాపు 80,000 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలోని సుమారు 21,000 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ‘రైతు సోదరులు తమ కష్టార్జితానికి సరైన ధర పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
బలోపేతం కానున్న రేషన్ వ్యవస్థ
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఢిల్లీ ప్రభుత్వం రాసిన లేఖకు తక్షణ స్పందన రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం చేకూరడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లభించే ఆహార ధాన్యాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అవసరమైన పత్రాలు
సేకరణ కేంద్రాల్లో తమ పంటను విక్రయించాలనుకునే రైతులు ఈ క్రింది ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
1. భూమి రికార్డులు
2. బ్యాంక్ పాస్బుక్
3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి)
అప్పుడు ఎందుకు సేకరణ ఆపారంటే..
నాలుగేళ్ల క్రితం (2021-22 నుంచి) ఢిల్లీలో గోధుమల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధానంగా కొన్ని పరిపాలనాపరమైన, క్షేత్రస్థాయి కారణాలు ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఢిల్లీలో ఎఫ్సీఐ నేరుగా కొనుగోలు చేసే కేంద్రాల సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్ మండీలకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనుగోలు ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై సరైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ స్తంభించిపోయింది.
2021-22 సమయంలో బహిరంగ మార్కెట్లో గోధుమలకు మంచి ధర లభించడం, ఎగుమతులకు అవకాశం ఉండటంతో రైతులు కూడా ప్రభుత్వ కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. దీన్ని సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను క్రమంగా తగ్గించారు. రాజధాని ప్రాంతంలో పట్టణీకరణ పెరగడం వల్ల సాగు భూమి తగ్గుతోందన్న కారణంతో సేకరణ ప్రాధాన్యతను తగ్గించారు. కానీ, ఇప్పటికీ సుమారు 29,000 హెక్టార్లలో సాగు జరుగుతూనే ఉంది. ఈ కారణాల వల్ల గత నాలుగేళ్లుగా రైతులు తమ పంటను మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సేకరణ ప్రారంభించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.
ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!


