అనంతపురం జిల్లా: హనీ ట్రాప్ దందా దుమారం రేపుతోంది. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొట్టారు. ఈ నయా దందాపై ‘కవ్విస్తారు.. కాటేస్తారు!’ అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనం ఉమ్మడి జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బాధితులు నేరుగా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో అనంతపురం రూరల్, నాలుగో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు గ్యాంగ్ లీడరు లేడీబాస్తో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులందరిపైనా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు.
ఏళ్ల తరబడి సాగుతున్న దందా..
వలపు వయ్యారాలతో బాధితులకు వల వేసి, వీడియో కాల్స్, వ్యక్తిగత సంభాషణలను ఆయుధాలుగా మార్చుకుని రూ.లక్షలు దోచుకుంటున్న ఈ ముఠా కార్యకలాపాలు విస్తృతంగా సాగినట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా ‘లేడీ డాన్’ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్టు బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందట తిరుపతిలో ఒక ఫారెస్ట్ అధికారిని ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు వసూలు చేసిన ఘటన కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో తిరుపతిలో కేసు కూడా నమోదైంది. అలాగే కూడేరు మండలానికి చెందిన బాధితుడు ఈ ముఠా వలలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడం, అలాగే ముఠాలో డబ్బుల పంపకాల విషయంలో విభేదాలు రావడం వల్ల ఈ దందా వెలుగులోకి వచ్చింది.
లబోదిబోమంటున్న రిటైర్డ్ ఉద్యోగి..
అనంతపురం రూరల్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్లకు పైబడి ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత పనిమీద రుద్రంపేట వద్దనున్న డీమార్ట్ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ (అప్పటికే పక్కా ప్రణాళిక రచించారు) తారసపడి.. సదరు రిటైర్డ్ ఉద్యోగి చేస్తున్న పనికి సంబంధించి తమకు అవసరం ఉందని, ఇంటివద్దకు రావాలని చెప్పి ఫోన్ నంబరు తీసుకెళ్లింది. మరుసటి రోజు ఫోన్ చేసి రిటైర్డ్ ఉద్యోగిని రుద్రంపేట శివారులోని ప్రాంతానికి పిలిపించింది. అక్కడ ఇంట్లోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది. ‘రండి సార్.. పర్వాలేదు’ అంటూ వలపు మాటలతో రెచ్చగొట్టింది. ఈ పరిణామంతో కంగుతిన్న బాధితుడు ‘అమ్మా...ఏంటిది’ అంటుండగానే అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పాత్రధారులు రంగప్రవేశం చేశారు. రిటైర్డ్ ఉద్యోగిని న్యూడ్(నగ్నం)గా నిలబెట్టి వీడియోలు, ఫొటోల్లో బంధించారు. ఆయనతో పాటు ఉన్న మహిళపై తీవ్రస్థాయిలో చిందులేశారు. ‘నువ్వు అవసరం లేదుపో... మా కుటుంబ మర్యాద మంటగలిపావు’ అని అనడంతో ఆ వృద్ధుడికి ఏమి జరుగుతోందో తెలీక బిక్కమొహం వేశాడు. ‘నీ విషయం కూడా బయటపెడతా...ఎలా మా ఇంటికి వస్తావు. పోలీసులకు ఫిర్యాదు చేస్తా. మీ కుటుంబ సభ్యులందరికీ ఫొటోలు, వీడియోలు పంపుతా. సోషల్ మీడియాలోనూ పెడతాన’ని బెదిరించారు. దీంతో ఆయన లబోదిబోమంటూ తనకు ఏపాపమూ తెలీదని చెప్పినా వినలేదు. చివరగా రూ.10 లక్షలు ఇస్తే సమస్య ఇంతటితో ఆపేస్తామని, లేదంటే నీ బండారమంతా బయటపెడతామని చెప్పడంతో తన ఇబ్బందులన్నీ చెప్పుకుని చివరకు రూ.3 లక్షలు సమరి్పంచుకున్నాడు. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారు. అయితే ఎక్కువగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ధనవంతులను ఈ ముఠా లక్ష్యం చేసుకుంది.


