‘ధర్మో రక్షతి రక్షిత:’ అనే వేదోక్తి ప్రకారం, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సర్వకాలాలా కాపాడుతుంది. అయితే, గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఆలయాల భూములు, పవిత్ర ప్రసాదాలు, వైదిక సంప్రదాయాల నిర్వ హణపై జరుగుతున్న పరిణామాలు, వివాదాలు కోట్లమంది హైందవ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో దాదాపు 4 లక్షల ఎకరాల ఆలయ భూములు విస్తరించి ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఒక లక్ష ఎకరాల నుండి మాత్రమే దేవునికి నియమిత ఆదాయం లభిస్తోంది. మిగిలిన భూముల్లో సుమారు 87,000 ఎకరాలు ఆక్రమణల పాల య్యాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఇలాంటి గడ్డుకాలంలో, కూటమి ప్రభుత్వం పారదర్శకమైన బహిరంగ వేలం నిర్వహించ కుండా, విలువైన దేవాలయ భూములను 33 ఏళ్ల సుదీర్ఘ కాలానికి నామమాత్రపు అద్దెకు ప్రైవేటు సంస్థలకు, తమ తాబేదారులకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇది దైవద్రోహం కాదా? గత 2014–19 టీడీపీ హయాంలోనూ సదావర్తి సత్రం భూములను ఇదే రీతిన అప్పగించే ప్రయత్నం చేయగా, అప్పట్లో న్యాయస్థానం జోక్యంతో అది ఆగింది.
సంస్కృతికి ద్రోహం – గోసంరక్షణ వైఫల్యం
హైందవ ధర్మంలో గోమాత అత్యంత పవిత్రమైనది. కానీ ప్రస్తుత పాలనలో గోసంరక్షణ పూర్తిగా అటకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధ శాలలు విచ్చలవిడిగా పెరిగిపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 2025 నవంబరులో విజయవాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించి దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా దున్నపోతుపై వర్షం కురిసిన చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో వంద లాది ఆవులు రోగాల బారిన పడి మృత్యువాత పడటం కలకలం రేపింది. టీటీడీ ఈవో 43 ఆవులు చనిపోయాయని చెబితే, చైర్మన్ 22 అని, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ‘చావులే లేవు’ అని ప్రకటించడం భక్తులను పక్కదారి పట్టించడమే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో శ్రీవారి కైంకర్యాలకు, అభిషేకాలకు స్థానిక గోశాలల నుండి రోజుకు 1,700 లీటర్ల స్వచ్ఛమైన పాలు తిరుమలకు వెళ్లేవి. ప్రస్తుత పాలనలో కనీసం 500 లీటర్ల పాలు కూడా రావడం లేదన్నది సత్యం.
2024 ద్వితీయార్ధంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువు లను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎలాంటి పూర్తిస్థాయి దర్యాప్తు, స్వతంత్ర సంస్థల నివేదికలు రాకముందే, కేవలం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై అపవిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు.
లబ్ధి కోసం నీచ రాజకీయాలు
మరింత హేయమైన అంశం ఏంటంటే – గ్రామీణ ప్రాంతా లలో పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ధర్మ ప్రచారం, భజన మందిరాల స్థాపన అనే ఉన్నత ఆశయంతో జగన్ ప్రభుత్వం ‘శ్రీవాణి’ పథకాన్ని ప్రారంభించింది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నూతన చైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ పథకాన్ని ఒక ‘క్లాసికల్ ఫ్రాడ్’ (పెద్ద స్కామ్) అని అభివర్ణిస్తూ, దీనిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఆ మాటలు కేవలం రాజకీయ వేదికలకే పరిమితమయ్యాయి.
ప్రస్తుతం అదే శ్రీవాణి పథకాన్ని రద్దు చేయకపోగా, మరింత విస్తరిస్తున్నారు. రద్దు చేస్తామన్న పథకాన్ని కొనసాగించడం వెనుక ఉద్దేశం, పారదర్శక తను పక్కనబెట్టి దళారీ వ్యవస్థకు పెద్దపీట వేయడమే. శ్రీవాణి టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేకుండా పోయింది. సామాన్య భక్తునికి సమాన హక్కులతో కూడిన దైవ దర్శనం కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య రాణి సదాశివమూర్తిని నిబంధనలకు విరుద్ధంగా పదవి నుండి తొల గించడానికి పాలకమండలి తీర్మానం చేయడం హేయమైన అంశం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 700 ‘వేద పారాయణదార్ల’ (శ్రీవారి వేద పారాయణ పథకం) పోస్టుల భర్తీలో స్థానిక వేదపండితులను కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
భద్రతా లోపాలు – ఆలయాల కూల్చివేతలు
అలాగే, తిరుమలలోని పరకామణి (కానుకల లెక్కింపు) విభా గంలో గతంలో రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టి దొంగతనాలను అరికట్టగా, ఇప్పుడు పాత విషయాలను రాజకీయం చేస్తూ ఆలయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. ఇటీవల జరిగిన చెన్నై పరకామణి అక్రమంపైగానీ, తిరుమల పరకామణి చోరీపైగానీ... ఇటు తితిదే, అటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు, తెలుగుసంస్కృతికి వెన్నెముకలైన హరికథ, కూచిపూడి వంటి సాంప్రదాయ కళారూపాల విభాగాలను మూసివేయడం తితిదే విద్యా వ్యవస్థకే తీరని కళంకం.
గత రెండేళ్ల కాలంలో వివిధ ప్రముఖ ఆలయాలలో జరిగిన ప్రమాదాలు భక్తుల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తు న్నాయి: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 6 గురు భక్తులు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యమంత్రివర్యులు గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో కనీసం మొసలి కన్నీరైనా కార్చారు. కానీ ఇక్కడ, భక్తుల అత్యుత్సాహమే దానికి కారణమని చర్చ లేవదీశారు. అసలు బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడం ఘోరమైన తప్పిదం.
సింహాచలం అప్పన్న కొండపై రక్షణ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టి నంత ఆవేదన కూడా కలగలేదు. శ్రీకూర్మం ఆలయంలో విష్ణు అవ తారంగా భావించే పవిత్ర నక్షత్ర తాబేళ్లు చనిపోతే, కనీసం పోస్ట్ మార్టం కూడా లేకుండా దహనం చేశారు. కాశీబుగ్గలో 9 మంది భక్తులు మరణిస్తే ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు. వీటికి తోడు, కడపలో కాశీ నాయన జ్యోతి క్షేత్రం గోశాలను, అన్నదాన సత్రాలను అటవీ శాఖ బుల్డోజర్లతో కూల్చివేయడం, నెల్లూరు, నరసరావు పేటలో రోడ్డు విస్తరణ పేరుతో ఆలయ నిర్మాణాలను తొలగించడం ఎంతటి అమానుషం!
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠాధిపతుల సదస్సును వైభవంగా నిర్వహించి, వారిచ్చిన సూచనలతో తిరుమలపై అన్య మతస్థులు హిందూమతం స్వీకరించటానికి ఓ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు... కానీ శాశ్వతమైన ధర్మసూత్రం ఎప్పటికీ చెరిగిపోదు. భగవంతుని ఆస్తులను, భక్తుల నమ్మకాన్ని సంపూర్ణంగా కాపాడ టమే నిజమైన రాజధర్మం.
కానీ ఆలయాల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని వ్యాపార వస్తువులుగా మార్చి, భగవంతుని సంపదను ధార్మిక కార్యాలకు ఉపయోగించకుండా, స్వార్థ రాజకీయాలకు వనరుగా మార్చిన ఘనత చంద్రబాబుది. అయితే మోసం అనే దట్టమైన చీకటి మేఘాలు ఎంతగా కమ్మేసినా, సత్యం అనే సూర్య కాంతి చివరికి వాటిని ఛేదించుకుని వెలుగులోకి రావడం ఖాయం.
-వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు
-భూమన కరుణాకర రెడ్డి


