ఇన్ బాక్స్
పురాతన కాలం నుంచి ఉన్న వేలాది చెరువులు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మత్స్యకారుల జీవనానికి మూలస్తంభాలు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 24,189 చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 5,72,167 ఎకరాలకు పైగా విస్తీ ర్ణంలో చెరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 27 లక్షల మంది జీవనం సాగిస్తు న్నారు. అలాగే 4,500కు పైగా మత్స్యకార సహకార సంఘాలు నమోదై ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగం గణనీయంగా విస్తరించింది. 2014– 15లో సుమారు 2 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ప్రస్తుతం 4.5 లక్షల టన్నులకు పైగా పెరిగింది. అయినా మత్స్యకార కుటుంబాల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు లేదు. అప్పులు, అస్థిర ఉపాధి, మధ్యవర్తుల దోపిడీ, తక్కువ ఆదాయం వారిని వెంటాడుతున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం చెరువుల చేపల పెంపకం హక్కులు నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు ఇవ్వాలి. ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మధ్యవర్తులను తొలగించి ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు నిజమైన మత్స్యకారులకు చేరేలా చేయడం.
కానీ నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల పేరుతో లీజుకు తీసుకున్న చెరువులను గోప్యంగా కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు, దళా రులకు సబ్ లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా అసలు మత్స్యకారులు తమ సొంత చెరువుల్లోనే కూలీలుగా మారిపోతున్నారు. చేపల మార్కెట్లో ప్రస్తుతం రోహు, కట్ల వంటి సాధారణ చేపల ధరలు అనేక పట్టణాల్లో కిలోకు రూ. 180 నుంచి రూ. 250 వరకు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల చేపలు రూ. 300 నుంచి రూ. 500 వరకు విక్రయమవుతున్నాయి. చెరువుల వద్ద మత్స్యకారు లకు లభిస్తున్న ధరలు దీనికంటే చాలా తక్కువ. ఉత్పత్తి ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని మధ్యవర్తులు మింగేస్తున్నారు.
మత్స్యకార సహకార సంఘాలకు అనేక చోట్ల ఎన్నికలు ఏళ్ల తరబడి జర గడం లేదు. సభ్యులకు లీజు వివరాలు తెలియడం లేదు. ఆదాయం–ఖర్చుల లెక్కలు బహిర్గతం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మత్స్యశాఖ అధికారులే బినామీ పేర్లతో కాంట్రాక్టు వ్యవస్థలో భాగమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల లీజులపై సమగ్ర సామాజిక తనిఖీ జరగాలి. చేపల కొనుగోలు, మార్కెటింగ్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష మార్కెట్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలి. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ కేంద్రాలు మత్స్యకార సంఘాల ఆధీనంలో ఉండాలి. లాభాలు నిజమైన మత్స్యకారునికి చేరాలి.
– మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ కార్యదర్శి


