పెట్టుబడికి జేమ్స్'బాండ్'

పెట్టుబడికి జేమ్స్'బాండ్'


ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ రూ.1,750 కోట్లు సమీకరించాలనుకుంది. పన్ను లేకుండా ఉండే బాండ్ల ఇష్యూ మొదలెట్టింది. రెండ్రోజుల్లోనే ఇష్యూ ముగిసింది. డిసెంబర్ 3న మొదలైన ఈ ఇష్యూకు 16 వరకు గడువుంది. కానీ రెండ్రోజుల్లోనే 3.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ కావడంతో ఇష్యూ ముగిసినట్లు సంస్థ ప్రకటించింది. పన్ను రహిత బాండ్లకు జనంలో ఎంత ఆదరణ ఉందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

 

 ఎన్‌టీపీసీ ఇష్యూకు లభించిన ఆదరణ చూసి... ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) కూడా బాండ్లు జారీ చేయడానికి ముందుకొచ్చింది. గతం కన్నా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది కూడా. ఒకవైపు పన్ను రహిత బాండ్లు, మరోవైపు ఎన్‌సీడీలతో వివిధ కంపెనీలు దీర్ఘకాలానికి అధిక వడ్డీని ఆఫర్ చేస్తుండటంతో వీటిని తట్టుకోవడానికి బ్యాంకులు సైతం వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రెండు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్, రెండు ఎన్‌సీడీల ఇష్యూలున్నాయి. అసలు ఈ బాండ్లేంటి? ఎన్‌సీడీలేంటి? వాటిలో పెట్టుబడి సురక్షితమేనా? లాభం ఉంటుందా? ఇదే ఈ వారం ప్రాఫిట్ కథనం...ట్యాక్స్ ఫ్రీ బాండ్స్...

 

 పోస్టల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల మాదిరిగా ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని ఆదాయపు పన్నులో మినహాయింపుగా చూపించలేం. కానీ ఈ బాండ్లపై వచ్చే వడ్డీకి మాత్రం పన్ను కట్టక్కర్లేదు. అధిక ట్యాక్స్ శ్లాబ్‌లో ఉన్న వారికి ఇవి మంచివే. ఉదాహరణకు బ్యాంకులు 10 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్‌పై 9 శాతం వడ్డీ ఇస్తున్నాయి. కానీ 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌లో ఉన్నవారికి ఈ వడ్డీపై పన్ను ఉంటుంది కనక నికరంగా 6 శాతం వడ్డీయే గిట్టుబాటు అవుతుంది. అదే ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం వడ్డీ చేతికొస్తుంది. అంతేకాక ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ప్రభుత్వరంగ సంస్థలే జారీ చేస్తాయి కనక రిస్క్ ఉండదు. ఇవి దీర్ఘకాలిక బాండ్లే కానీ... స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉంటాయి కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు.

 

 హడ్కో...

 హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా రూ.2,439 కోట్లు సమీకరించనుంది. 10, 15, 20 ఏళ్ల కాలపరిమితిలో లభించే ఈ బాండ్స్‌పై వరుసగా 8.76, 8.83, 9.01 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ.1,000 ముఖ విలువ కలిగిన బాండ్లను కనీసం ఐదు కొనాల్సి ఉంటుంది. అంటే కనీస పెట్టుబడి రూ.5 వేలు. డిసెంబర్ 2న ప్రారంభమైన ఈ ఇష్యూ జనవరి 10 వరకు ఉంటుంది. కానీ లక్ష్యాన్ని చేరుకుంటే గడువు కంటే ముందే ముగించొచ్చు. ఈ ఇష్యూకి కేర్ ‘ఏఏప్లస్’ రేటింగ్ ఇచ్చింది.

 

 ఐఐఎఫ్‌సీఎల్...

 ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) రూ.3,000 కోట్లకు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌ను జారీ చేస్తోంది. ఇష్యూ డిసెంబర్ 9న మొదలవుతుంది. అక్టోబర్-నవంబర్ నెలలో ఇచ్చిన వడ్డీరేటు కంటే ఎక్కువ రేటును ఇప్పుడు ఆఫర్ చేస్తుండటం విశేషం. గత ఇష్యూలో 20 ఏళ్ల  కాలపరిమితిపై 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తే ఇప్పుడు 8.91 శాతం  వడ్డీని ఇస్తోంది. 10, 15, 20 ఏళ్ల కాలపరిమితుల్లో లభిస్తున్న ఈ బాండ్స్‌పై వరుసగా 8.66, 8.73, 8.91 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

 

 ఎన్‌సీడీ ఇష్యూ...

 డిబెంచర్లంటే రుణ పత్రాలు. వాటిలో షేర్లుగా మార్చుకునేందుకు అవకాశమిచ్చేవి కన్వర్టబుల్ డిబెంచర్లు. అలా వీల్లేనివి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీలు). కార్పొరేట్ సంస్థలు వాటి వ్యాపార విస్తరణకు అవసరమయ్యే నిధుల కోసం ఎన్‌సీడీలు జారీ చేస్తుంటాయి. అంటే బ్యాంకుల దగ్గర అప్పు చేయకుండా జనం దగ్గర అప్పు చేయటమన్నమాట. నిర్ణీత కాలానికి వాటిపై వడ్డీ కూడా చెల్లిస్తాయి. బ్యాంకు డిపాజిట్లు, ట్యాక్స్ ఫ్రీ బాండ్లతో పోలిస్తే వీటిలో రిస్క్ ఎక్కువ. అందుకే వడ్డీ కూడా ఎక్కువే ఉంటుంది. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గానీ, వచ్చే వడ్డీపై గానీ ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు. కాస్త రిస్క్‌కు సిద్ధపడి బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ కావాలనుకునే వారికి ఇవి అనువైనవి.

 

 శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్...

 శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఎన్‌సీడీ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరిస్తోంది. నవంబర్ 25న ప్రారంభమై.. ఈనెల 24న ముగియనున్న ఈ ఇష్యూలో మూడు, నాలుగు, ఐదేళ్ళ కాలపరిమితిలో బాండ్లను జారీ చేస్తున్నారు. వీటిపై వరుసగా 11%, 11.25%, 11.5% వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితి గల బాండ్‌పై ఏటా వడ్డీ వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. లేదంటే చివర్లోనే మొత్తం తీసుకోవచ్చు. ఇష్యూలో 40 శాతం ఎన్‌సీడీలను రూ.5 లక్షల లోపు ఇన్వెస్ట్ చేసే చిన్న ఇన్వెస్టర్లకే కేటాయిస్తారు.

 

 ఐఐహెచ్‌ఎఫ్‌ఎల్...

 ఇండియా ఇన్ఫోలైన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐహెచ్‌ఎఫ్‌ఎల్) ఎన్‌సీడీ ఇష్యూ ద్వారా  రూ.500 కోట్లు సమీకరిస్తోంది. ఇష్యూ ఈనెల 12న ఆరంభమై 30న ముగుస్తుంది. ప్రతి నెలా వడ్డీ వెనక్కిచ్చేలా ఐదేళ్ల కాలపరిమితికి జారీ చేస్తున్న ఈ బాండ్లపై... 11.52 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top