
రూ.32,000 దాటిన బంగారం ధర
దేశీయంగా ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర మళ్లీ రూ. 32 వేల పైకి చేరింది.
ముంబై: దేశీయంగా ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర మళ్లీ రూ. 32 వేల పైకి చేరింది. అంతర్జాతీయంగా సానుకూల ధోరణితో పాటు పండుగ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయంగా కొనుగోళ్ల జోరు దీనికి ప్రధాన కారణం. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.175 ఎగసి రూ.32,165కు చేరింది. ఆభరణాల బంగారం కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ. 32,015కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రా) ధర శుక్రవారం 1,353 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా సహాయక చర్యల ప్యాకేజ్లు మరికొంతకాలం కొనసాగుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి సెంటిమెంట్కు బలంగా ఉంది.