పాక్‌కు దీటైన బదులు! | Four Pakistan posts across LoC destroyed, says Army | Sakshi
Sakshi News home page

పాక్‌కు దీటైన బదులు!

Oct 30 2016 9:26 AM | Updated on Mar 23 2019 8:29 PM

భారత సైనికుడిని హత్యచేసి.. అతని శరీరాన్ని ముక్కలు చేసిన ఘటనపై రగిలిపోతున్న సైన్యం పాకిస్థాన్‌కు దీటైన బదులు ఇచ్చింది.

జమ్మూ: భారత సైనికుడిని హత్యచేసి.. అతని శరీరాన్ని ముక్కలు చేసిన ఘటనపై రగిలిపోతున్న సైన్యం పాకిస్థాన్‌కు దీటైన బదులు ఇచ్చింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) మీదుగా ఉన్న పాక్‌ సైనిక పోస్టులు లక్ష్యంగా పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూ.. నాలుగు దాయాది దేశపు సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో పాక్‌ సైనికులు పెద్ద ఎత్తున దెబ్బతిని ఉంటారని సైన్యం ప్రకటించింది.

సరిహద్దుల మీదుగా ఉత్తర కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లో ఈ దాడులు జరిపినట్టు సైన్యం ప్రకటించింది. ‘కేరన్‌ సెక్టర్‌లో జరిపిన భారీ కాల్పుల్లో నాలుగు పాకిస్థాన్‌ పోస్టులు ధ్వంసమయ్యాయి. పాక్‌ సైన్యం పెద్ద ఎత్తున నష్టపోయింది’ అని ఆర్మీ నార్తరన్‌ కమాండ్‌ ప్రకటించింది. ఎంతమంది పాక్‌ సైనికులు చనిపోయారనే దానిపై సైన్యం మరిన్ని వివరాలు తెలుపలేదు.

శుక్రవారం సాయంత్రం కుప్వారా జిల్లాలోని మచిల్‌ సెక్టర్‌లో సైనికుడు మన్‌దీప్‌ సింగ్‌ను హతమార్చి.. ఆయన దేహాన్ని ఉగ్రవాదులు ముక్కలుగా నరికిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన్న ఉగ్రవాదులను సైన్యం అడ్డుకోవడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతిచెందిన మన్‌దీప్‌ దేహాన్ని ముక్కలు నరికి.. ఉగ్రవాదులు పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌ (పీవోకే)లోకి పారిపోయారు. ఈ దుర్మార్గ చర్యపై భారత సైన్యం తీవ్రంగా స్పందించింది. ఇది అత్యంత హేయమైన ఘటన. ఈ అనాగరిక చర్యకు తగినరీతిలో మేం బదులిస్తామని సైన్యం శనివారమే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement