సూపర్ మార్కెట్లో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించి నలుగురు మరణించిన సంఘటన పశ్చిమ కోలంబియాలో చోటు చేసుకుంది.
సూపర్ మార్కెట్లో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించి నలుగురు మరణించిన సంఘటన పశ్చిమ కోలంబియాలో చోటు చేసుకుంది. పనామా సరిహద్దుల్లోని చోకొ ప్రావెన్స్ రాజధాని క్విబ్డో పట్టణంలో ఆ ఘటన చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్లోని ముగ్గురు ఉద్యోగులతోపాటు ఆ షాపు యజమాని కుమార్తె కూడా మరణించిన వారిలో ఉన్నారు. ఆ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు పట్టణంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
సూపర్ మార్కెట్ లోని ఉంచిన ప్యాకేజీ బాంబు కారణంగానే ఆ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. రెవెల్యూషనరీ ఆర్మీడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా ( ఎఫ్ఏఆర్సీ) లేదా లాస్ యూర్బెనొస్ తీవ్రవాద సంస్థ ఆ దుశ్చర్యకు పాల్పడి ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ దుశ్చర్యకు పాల్పడింది తామే అంటూ ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించ లేదన్నారు. ఆ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.