ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఏ పార్టీకీ రాని నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు అనివార్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఏ పార్టీకీ రాని నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు అనివార్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గురువారం రాత్రి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా.హర్షవర్ధన్ చర్చల అనంతరం ఈ విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేనందున తాము ప్రతిపక్షంలోనే కూర్చునేందుకు సిద్ధపడుతున్నట్టు గవర్నర్కు తెలిపినట్లు ఆయనను కలిసిన అనంతరం రాత్రి 8 గంటలకు హర్షవర్ధన్ మీడియాతో ప్రకటించారు. మరోమారు ఎన్నికలకు వెళ్లి అయినా స్పష్టమైన మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఏడు రోజుల్లో బలం నిరూపించుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిపక్షంలోనే కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఢిల్లీ ప్రజలను క్షమాపణ కోరుతున్నాం’ అని అన్నారు. ఢిల్లీలో మరోమారు ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా మేం పూర్తి బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అనుకుంటున్నామన్నారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు రావడానికి బీజేపీ కారణం కాబోదని, అది ప్రజల తీర్పని అన్నారు. ఇతరులు ప్రభుత్వం ఏర్పాటుచేస్తే స్వాగతిస్తామన్నారు. కానీ ఆప్కు మద్దతునిస్తారా? లేదా? అన్నది మాత్రం స్పష్టంచేయలేదు.
కేజ్రీవాల్కు లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆహ్వానం...
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన పార్టీ బీజేపీ విముఖత చూపడంతో ఆ తర్వాత ఎక్కువ స్థానాలు వచ్చిన ఆప్ను లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఉదయం చర్చలకు రావాలంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు గవర్నర్ గురువారం ఆహ్వానం పంపారని పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తాము ఎవరికీ మద్దతునివ్వమని, ఎవరి మద్దతూ తీసుకోబోమని కేజ్రీవాల్ బుధవారమే ప్రకటించినందున ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు జరగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఢి ల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 32 (ఎస్ఏడీ స్థానంతో కలిపి), ఆప్కు 28, కాంగ్రెస్కు 8 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు కావల్సి ఉండగా ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీకి కూడా నాలుగు స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో సర్కారు ఏర్పాటుపై ప్రతిష్టంబన ఏర్పడింది.
‘ఆప్’కు మద్దతుపై కాంగ్రెస్ పరిశీలిస్తోంది: రాహుల్
ప్రభుత్వ ఏర్పాటుకోసం ఆప్కు మద్దతు ఇచ్చే విషయాన్ని తమ పార్టీ పరిశీలిస్తోందని గురువారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నేపథ్యంలో ఆప్ కు కాంగ్రెస్ మద్దతునిస్తుందా? అన్న విలేకరుల ప్రశ్నకు రాహుల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. అంతకుముందు ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన 8 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై వారి గెలుపు, పార్టీ ఓటమికి గల కారణాలను ఆరా తీశారు.