సాక్షి, పెద్దపల్లి: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానంటూ ఆ ప్రేమికుడు రెండేళ్లు వెంట తిరిగాడు. పెళ్లి పేరెత్తడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. ఇది గమనించిన ప్రియురాలు అతడి ఇంటి ముందు బైఠాయించింది. పెళ్లి చేసుకునే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదంటూ మౌనపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న ప్రేమికుడు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
వివరాలు.. మంథని మండలం మైదుపల్లికి చెందిన రజినీకాంత్, ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ముద్ద సింధు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రజినీకాంత్ వద్ద సింధూ పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి తప్పించుకునేవాడు.
దీంతో మనస్తాపానికి గురైన సింధు ఈ రోజు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మైదుపల్లిలోని రజినీకాంత్ ఇంటి ముందు బైఠాయించింది. ప్రియుడితో పెళ్లి జరిపించేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ దీక్షకు దిగింది. ఆమె ఇంటి ముందు కూర్చోవడం గమనించిన రజినీకాంత్ వెనుక గుమ్మం ద్వారా పరారై తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో అతన్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.