సౌదీలో ఉండలేక.. స్వదేశం రాలేక ! 

Workers troubles in the saudi - Sakshi

     కార్మికుల నరకయాతన 

     ఆరునెలల వేతనం ఇవ్వని కంపెనీ 

     కోర్టును ఆశ్రయించినా ఫలితం శూన్యం 

     ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వేడుకోలు  

మోర్తాడ్‌(బాల్కొండ): పొట్ట చేత పట్టుకొని.. పని కోసం సౌదీ వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడి కంపెనీ చేసిన మోసంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌదీ అరేబియా దమామ్‌లో ప్రాజెక్టు సిస్టమ్‌ గ్రూపు అనే జనరల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కాంట్రాక్టులను నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు కార్మికులకు కంపెనీ వీసాలు జారీ చేసింది. తెలంగాణ జిల్లాల నుంచి పలువురు కార్మికులు వీసాలు పొంది అక్కడికి వెళ్లారు. ఇటీవల సౌదీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కంపెనీ కాంట్రాక్టులు తగ్గించుకుంది. మొత్తం 56 మంది కార్మికులుండగా, 12 మందిని ఆరు నెలల క్రితం ఇళ్లకు పంపించి వేసింది.

మిగిలిన వారికి అకామా ఇవ్వకుండా.. పని కూడా చెప్పకుండా సతాయిస్తోంది. ఆరు నెలలుగా వేతనాలు కూడా ఇవ్వటం లేదు. చివరికి అక్కడి లేబర్‌ కోర్టును ఆశ్రయించగా, కార్మికులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తమపై కోర్టుకు వెళ్లినందుకు కంపెనీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ భోజన, సరైన నీటి వసతి కూడా కల్పించడం లేదు. వేతనం.. పాస్‌పోర్టులు ఇస్తే ఇంటికి వెళ్తామని చెప్పినా వినటం లేదు. ఈ క్రమంలో కార్మికులు అక్కడి మన విదేశాంగ శాఖలో ఫిర్యాదులు చేసినా స్పందన లభించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని కార్మికులు కోరుతున్నారు.     

నరకంలో ఉన్నట్లుంది... 
కంపెనీ యాజమా న్యం వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నా యి. సౌదీలో ఉండటం అంటే నరకంలో ఉన్నట్లుగా ఉంది. మమ్మల్ని ఎలాగైనా ఇళ్లకు రప్పించాలి. 
– రవీందర్, జక్రాన్‌పల్లి, నిజామాబాద్‌ జిల్లా 

విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్తాం 
సౌదీలోని దమామ్‌లో తెలంగాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై విదేశాంగశాఖను ఆశ్రయిస్తాం. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలసి బాధితులను ఇండ్లకు రప్పించడానికి చర్యలు తీసుకుంటాం. 
– పి.బసంత్‌రెడ్డి, టి.గల్ఫ్‌ కల్చరల్‌ ప్రతినిధి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top