గెలుపు ఖాయం... మెజారిటీయే లక్ష్యం | win confirmed ... The majority of the target | Sakshi
Sakshi News home page

గెలుపు ఖాయం... మెజారిటీయే లక్ష్యం

Sep 3 2014 11:35 PM | Updated on Mar 29 2019 9:24 PM

మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నేతల దిమ్మదిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య తెలిపారు.

సదాశివపేట: మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నేతల దిమ్మదిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య తెలిపారు. బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జరి గిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

 టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని, అధిక మెజారిటీయే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని  పిలుపునిచ్చారు. సీమాంధ్ర పాలనలో బానిస బతుకులే దిక్కు అయ్యాయని, ఇక బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు అనుకూలంగా ఏనాడూ మాట్లాడలేదన్నారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా మంజూరు చేయలేదన్నారు. అకాల వర్షాలు, వడగళ్లకు నష్టపోయిన తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ రూ. 480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేశారని వివరించారు.

 అదే విధంగా 40 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయబోతున్న ఘనత కూడా కేసీఆర్‌దేనని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని దాదాపు 80 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాజయ్య పేర్కొన్నారు. దళిత, గిరిజన, మైనార్టీ బీసీ ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రుపాయల నిధులను కేటాయించడానికి నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, గువ్వల బాల్‌రాజ్, సంజీవరావు, మాజీ ఎమ్మెల్యేలు హరిశ్వర్‌రెడ్డి, రత్నం, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ కోడూరి రవీందర్ యాదవ్, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement