పుకార్ల షికారు 

Who WIll Be Jumping Into TRS Party - Sakshi

రెండు జిల్లాలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంపు చేస్తారని ప్రజల్లో అనుమానం   

రాష్ట్రంలో వరుసగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటున్న ఎమ్మెల్యేలు 

అధినాయకత్వంలో లోపించిన సమన్వయం 

ఎన్నికల వేళ కార్యకర్తల్లో ఆందోళన 

సాక్షి, భూపాలపల్లి: కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవిలా మారింది కాంగ్రెస్‌ పరిస్థితి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందోనని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగిరినప్పటికీ.. అనంతరం వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పాగా వేసింది.  ఇటీవల జరిగిన పరిణామాలతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో కార్యకర్తలు, ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు జిల్లాల పరిధిలో ఉన్న ములుగు, మంథని, భూపాపలల్లి, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వీరందరు కాంగ్రెస్‌లోనే ఉంటామని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

పార్టీ ఫిరాయింపులపై చర్చ.. 
మనం ఎంతగానో కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని కార్యకర్తలు, ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా పక్క నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు చేజారిపోతుండడంతో జనాల్లో చర్చకు కారణమవుతోంది. మొన్నటి దాకా మహబూబాబాద్‌ ఎంపీ పరిధి కిందకు వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పినపాక, భద్రాచలం, ములుగు, ఇల్లందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉంటే ప్రస్తుతం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ములుగులో సీతక్క, భద్రాచలంలో పొదెం వీరయ్య మాత్రమే పార్టీలో మిగిలారు.  

జోరు కొనసాగేనా.. 
లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వస్తుండడంతో జిల్లాలో కాంగ్రెస్‌ జోరు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ ఎన్నికల సమయానికి పార్టీలు మారే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఉంటారు, లేకుంటే పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎవరికీ తోచినట్లు వారు జోస్యం చెబుతున్నారు.    
కార్యకర్తల్లో అనుమానాలు.. 
రాష్ట్రంలో  అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిన్పటికీ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీనే గెలుపొందింది. ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలు వినివస్తున్నాయి. అయితే  అలాంటివి ఉండవని  చాలా సార్లు ఎమ్మెల్యేలు కొట్టిపారేశారు. కానీ  ఎన్నికలు వస్తున్న వేళ ఇటువంటి ప్రచారాలు కాంగ్రెస్‌ కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.  

ఆత్మస్థైర్యం కోల్పోతున్న కార్యకర్తలు.. 
అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతలు గెలిచినా, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జీపీలను కైవసం చేసుకోలేదనే బాధ కాంగ్రెస్‌ కార్యక్తల్లో ఇప్పటికీ ఉంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మరింత గట్టిగా పనిచేద్దాం అనుకుంటున్న తరుణంలో వరసగా  పార్టీ నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతుండడంతో కారకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top